శభాష్ అర్చన తిమ్మరాజు.. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని కోరుతూ..
ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్, తమ సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని చారిటీ రైడ్స్ను నిర్వహిస్తుండటం మనం గతంలో చూశాం. అలాగే, ఈ మేడ్ ఇన్ ఇండియా మోటార్సైకిళ్లను ఉపయోగించే రైడర్లు కూడా తామే స్వయంగా ఇలాంటి కొన్ని చారిటీ రైడ్స్, కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. వీటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి.

తాజాగా బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల అర్చన తిమ్మరాజు అనే ఓ మహిళా రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ వినికిడి లోపం ఉన్నవారికి అవకాశాలను సృష్టించడం మరియు అన్వేషించడం మరియు వారికి వివిధ రకాలైన కమ్యూనికేషన్ల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓ రైడ్ను ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఆమె బెంగళూరు నుండి ఉత్తరాఖండ్ వరకూ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్పై రైడ్కు శ్రీకారం చుట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్ సైలెంట్ ఎక్స్పెడిషన్ మోటార్సైకిల్ రైడ్ పేరుతో ఆమె ఈ యాత్రను ప్రారంభించారు.

సాధారణంగా చాలా మంది మోటారుసైకిల్ రైడ్స్ని అనేక కారణాల కోసం నిర్వహిస్తుంటారు. వారిలో కొందరు ఆనందం కోసం ఇలాంటి రైడ్స్ చేస్తుంటే, మరికొందరు అవకాశాలను అన్వేషించడానికి లేదా సమాజానికి మేలు చేసే ఓ మహత్తరమైన కార్యక్రమం కోసం రైడ్స్ నిర్వహిస్తుంటారు. అలాంటి వర్గానికి చెందిన వారే అర్చన తిమ్మరాజు.

వినికిడి లోపంతో పోరాటం చేసే మోటార్సైకిలిస్టుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన సైలెంట్ ఎక్స్పెడిషన్ అనే ఎన్జివో సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. వినికిడి లోపం ఉన్నవారికి మరిన్ని అవకాశాలను సృష్టించడం మరియు వారి సామర్థ్యాలను, అవకాశాలను అన్వేషించడంలో వారికి మద్దతు ఇవ్వడమే ఈ సైలెంట్ ఎక్స్పెడిషన్ ఎన్జివో ప్రధాన లక్ష్యం.

అర్చన తిమ్మరాజు కూడా అలాంటి వైకల్యం ఉన్నవారిలో ఒకరు. ఆమెకు వినికిడి లోపం ఉన్నప్పటికీ, దానిని సవాలుగా తీసుకొని మోటార్సైకిల్ నడపటం నేర్చుకున్నారు. కాబట్టి, ఆమెకు ఇందులో ఉన్న సవాళ్లు మరియు అవకాశాల గురించి స్పష్టంగా తెలుసు. వాటి గురించి ఇతరులకు అవగాహన కల్పించేందుకు ఆమె బెంగళూరు నుండి ఉత్తరాఖండ్ వరకూ రైడ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఈ రైడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం వివిధ రకాలైన కమ్యూనికేషన్ల గురించి, ముఖ్యంగా నాన్-వెర్బల్ లాంగ్వేజ్ (మూగ భాష) గురించి వినికిడి లోపం ఉన్న వారిలో అవగాహన కల్పించడం కోసం ఆమె ప్రయాణించే మార్గంలో అనేక స్టాప్లను ఎంచుకున్నారు. ఈ రైడ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తమ వంతు మద్దతును అర్చనకు అందించనుంది.

ఇందులో భాగంగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన తమ సరికొత్త మీటియోర్ 350 మోటార్సైకిల్ను ఈ కంపెనీ అర్చన తిమ్మరాజుకు అందజేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఈ బ్రాండ్ నుండి 'జె సిరీస్' ప్లాట్ఫామ్పై తయారైన మొదటి ఉత్పత్తి. ఇది సరికొత్త చాస్సిస్ను మరియు ఇంజన్ను కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్సైకిల్లో 349 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.12 బిహెచ్పి శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్సైకిల్లో ఉపయోగించిన ఇంజన్ను పూర్తిగా సరికొత్త టెక్నాలజీతో తయారు చేసింది. ఇది మునుపటి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ల కన్నా మరింత మెరుగైనది మరియు దూర ప్రయాణాలను ఉద్దేశించి డిజైన్ చేయబడినది. కాబట్టి ఇది అర్చన తిమ్మరాజు చేపట్టిన లాంగ్ రైడ్కు ఎంతో అనువుగా ఉంటుంది.

అర్చన తిమ్మరాజుకి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కేవలం మీటియోర్ 350 మోటార్సైకిల్ను అందజేయటం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న తమ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ రైడ్లో ఆమెకు కావల్సిన సర్వీస్ను కూడా ఉచితంగా అందించనుంది. మరి ఆమె చేపట్టిన ఈ రైడ్ విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందాం. హ్యాట్సాఫ్ అర్చన..!


Click it and Unblock the Notifications








