ఓలా నుండి ఎలక్ట్రిక్ స్కూటర్; జనవరి 2021 నుండి ప్రారంభం
ప్రముఖ రైడ్-హెయిలింగ్ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా భారత ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. పిటిఐ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, జనవరి 2021లో ఓలా మొట్టమొదటి సారిగా దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సేవలను ప్రారంభించనుంది.

ఓలా మే 2020లో ఆమ్స్టర్డ్యామ్కి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ "ఎటర్గో బివి" కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ కంపెనీ ద్వారా ఓలా తమ ఉత్పత్తులను నెదర్లాండ్స్లో తయారు చేసి భారతదేశానికి తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంతో పాటు అనేక యూరోపియన్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి రానుంది.

మొదటి సంవత్సరంలో ఓలా మిలియన్ యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విక్రయించాలని యోచిస్తోంది. అలాగే, ఈ-స్కూటర్ యొక్క ప్రారంభ బ్యాచ్లను నెదర్లాండ్స్లోనే తయారు చేసే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా ఓ ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఓలా చూస్తోంది.

భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఓలా ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకసారి ప్లాంట్ను ఏర్పాటు చేసిన తర్వాత, దేశంలో సంవత్సరానికి 2 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తులను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఓలా నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే, భారతదేశంలో ఉత్పాదక సదుపాయం ఏర్పాటు చేయటం మరియు వాటిని ఇక్కడే తయారు చేయటం ద్వారా మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత సమర్థవంతంగా విక్రయించడానికి వీలవుతుంది. దీనికి తోడు, ఓలా బ్రాండ్ భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్'లోని ప్రయోజనాలను సైతం సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎటర్గో-బివి తయారు చేసే అత్యాధునిక స్కూటర్ల గురించి మాట్లాడుతుంటే, ఇవి అధిక సాంద్రత కలిగిన స్వాపబుల్ బ్యాటరీలతో తయారవుతాయి. ఒకే ఛార్జీపై ఇవి 240 కిలోమీటర్ల రేంజ్ని అందించగలవు. ఓలా భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో 20 మిలియన్ యూనిట్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించాలని కంపెనీ భావిస్తోంది.

ఒకసారి లాంచ్ చేసిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ ధరతో వచ్చే అవకాశం ఉంది. ఈ-స్కూటర్ మార్కెట్లో దీని ధర ట్రెడిషనల్ పెట్రోల్ పవర్డ్ మోడళ్ల మాదిరిగానే ఉంటుందని అంచనా.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేవలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, ఓలా ఈ విభాగంలోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తోంది. ఓలా నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తర్వాత, అవి ప్రీమియం విభాగంలో ఉంచబడతాయి మరియు ఈ విభాగంలో ఇతర ప్రధాన బ్రాండ్లైన ఏథర్, బజాజ్ మరియు టివిఎస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications








