అక్టోబర్ 21 నుండి Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ రీఓపెన్!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో అతికొద్ది సమయంలో మంచి పేరు తెచ్చుకున్న బ్రాండ్లలో రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) కూడా ఒకటి. ప్రస్తుతం, ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో ఆర్వి300 (RV300) మరియు ఆర్వి400 (RV400 ) అనే రెండు ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను విక్రయిస్తోంది. ఇవి రెండూ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ప్రత్యేకించి రివోల్ట్ మోటార్స్ అందిస్తున్న తమ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రివోల్ట్ ఆర్వి400 కోసం డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్ లను స్వీకరించడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు ఆర్వి400 కోసం బుకింగ్ లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

కంపెనీ ఈ మోటార్సైకిల్ బుకింగ్ లను అక్టోబర్ 21, 2021 వ తేదీ నుండి దేశంలోని 70 నగరాల్లో ప్రారంభించబోతోంది. అంతేకాకుండా, వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా రివోల్ట్ మోటార్స్ దేశంలో మరో 6 కొత్త నగరాల్లో తన రిటైల్ నెట్వర్క్ ను కూడా ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగుళూరు, కోల్కతా, జైపూర్, సూరత్, చండీగఢ్, లక్నో మరియు ఎన్సిఆర్తో సహా 64 కొత్త నగరాల్లోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ భారతదేశంలో తన రిటైల్ ఉనికిని విస్తరించింది.

తాజా సమాచారం ప్రకారం, ఆసక్తి ఉన్న కస్టమర్లు రివోల్ట్ మోటార్స్ వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా లేదా అధికారిక డీలర్షిప్ నుండి కానీ కొత్త రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా రివోల్ట్ మోటార్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ, "భారతీయ మార్కెట్లో ఇప్పటివరకు రివోల్ట్ మోటార్స్ ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంది మరియు రాబోయే సంవత్సరాల్లో పెద్ద మైలురాళ్లు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు.

తమ ప్రస్తుత సేల్స్ నెట్వర్క్ ను 6 నుండి 70 నగరాలకు విస్తరించడం ద్వారా కస్టమర్ల నుండి భారీ డిమాండ్ ఏర్పడిందని, తాము అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడం మొదలుపెట్టినప్పటి నుండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.

రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ బైక్ 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇందులో 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్పై 156 కి.మీ రేంజ్ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్లు కూడా ఉన్నాయి. ఎకో మోడ్లో దీని రేంజ్ 150 కిలోమీటర్లు, నార్మల్ మోడ్లో 100 కిలోమీటర్లు మరియు స్పోర్ట్ మోడ్లో 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్ను బట్టి టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది.

రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల కోసం కంపెనీ 'మై రివోల్ట్' అనే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ను కూడా అందిస్తోంది. ఈ యాప్ సాయంతో కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ బైక్ను తమ ఫోన్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు మరియు వివిధ రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్లో బైక్ లొకేటర్, జియో-ఫెన్సింగ్, కస్టమైజబల్ ఎగ్జాస్ట్ సౌండ్ మరియు బ్యాటరీ స్టేటస్తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ తమ రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ బైక్ కోసం ఓ కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ను 'స్వైప్ టు స్టార్ట్' పేరుతో పరిచయం చేశారు. ఇది కీలెస్ ఎంట్రీ ఫీచర్ మాదరిగా పనిచేస్తుంది. ఈ కొత్త 'స్వైప్ టు స్టార్ట్' ఫీచర్ను మైరివోల్ట్ స్మార్ట్ఫోన్ యాప్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే, మీ స్మార్ట్ఫోనే మీ ఎలక్ట్రిక్ బైక్ యొక్క తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. గడచిన సెప్టెంబర్ నెల నుండి ఈ కొత్త ఫీచర్ రివోల్ట్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో రివోల్ట్ ఆర్వి400 బైక్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి భౌతిక కీ అవసరం లేకుండానే తమ ఏఐ-ఎనేబుల్డ్ మోటార్సైకిల్ను స్టార్ట్ చేయడానికి మరియు స్టాప్ చేయడానికి అనుమతిస్తుంది.

స్వైప్ టు స్టార్ట్ ఫీచర్తో బైక్ను ఆన్ చేయడానికి, యూజర్ తన ఫోన్లో మైరివోల్ట్ యాప్ను ఓపెన్ చేసి పవర్ బటన్ను ఎడమ నుండి కుడి వైపుకి స్లైడ్ చేయాలి. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు కీ లేకుండా బైక్ను కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుకండా, వారు ఈ బైక్లోని ఇతర ఫీచర్లను కూడా రిమోట్గా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో బైక్ను లాక్ చేయడం లేదా అన్లాక్ చేయడం మరియు అప్లికేషన్ ద్వారా వారి బైక్ను గుర్తించడం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రివాల్ట్ ఆర్వి400 బైక్ ధర రూ. 90,799 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








