25,000 కు చేరిన 'Move OS 2.0' కస్టమర్ల సంఖ్య: ఓలా ఎలక్ట్రిక్
భారతీయ మార్కెట్లో అగ్రగామి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఈ నెల 18 (2022 జూన్) న తన 'ఎస్1 ప్రో' (S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త అప్డేటింగ్ ఆపరేటింగ్ సిస్టం 'మూవ్ ఓఎస్ 2.0' (Move OS 2.0) పరిచయం చేసింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకూండా ఇప్పుడు ఈ అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వల్ల వినియోగదారుడు ఎక్కువ ఫీచర్స్ కూడా పొందవచ్చు. కావున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు ఈ ఆపరేటింగ్ సిస్టం ను వినియోగించడానికి ఎక్కువ సంఖ్యలో ఇష్టపడుతున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ అందిస్తున్న ఈ కొత్త అప్డేటెడ్ 'మూవ్ ఓఎస్ 2.0' ఇప్పుడు ఏకంగా 25,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్నారని, కంపెనీ అధికారికంగా తెలిపింది. 2022 జూన్ నెల 30 నాటికి కంపెనీ యొక్క అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ 'మూవ్ ఓఎస్ 2.0' (Move OS 2.0) అప్డేట్ వస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మొదట్లో మూవ్ ఓఎస్ 2.0 బీటా వెర్షన్లో ప్రారంభించింది. ఇది కొంతమంది కస్టమర్లకు మాత్రమే అందించబడింది. ఈ అప్డేట్ స్కూటర్ యొక్క రేంజ్ (ఎకో మోడ్ లో) పెంచడమే కాకుండా.. బ్యాటరీ డ్రాప్ సమస్యను కూడా తొలగిస్తుంది.

అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్ లో ఒక ఛార్జ్ తో 170 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 100 కస్టమర్లకు 200 కిమీ పరిధిని అందించినట్లు కూడా తెలిసింది. మొత్తం మీద మూవ్ ఓఎస్ 2.0 పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు సింగిల్ ఛార్జ్ తో 150 కిమీ నుంచి 170 కిమీ పరిధిని అందిస్తాయని ఋజువైంది. అయితే దీని గరిష్ట వేగం 45 కిమీ/గం వరకు ఉండాలి. అప్పుడే ఈ పరిధిని పొందగలరు.

ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్ కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా హైవేలపై గంటకు 20 కిమీ నుండి 80 కిమీ మధ్య వేగంతో రైడ్ చేయాలనుకునే రైడర్లు ఎకో మోడ్లో కాకూండా ఇతర మోడ్లో ఈ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ను యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ సాయంతో మరింత సౌకర్యవంతమైన మరియు సున్నితమైన రైడ్ అనుభవాన్ని పొందవచ్చు.

మూవ్ ఓఎస్ 2.0 అప్డేట్ ద్వారా ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం డిజిటల్ లాక్ మరియు అన్లాక్ ఫీచర్ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ను మీరు ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ సాయంతో స్కూటర్ను లాక్ చేయవచ్చు లేదా అన్లాక్ చేయవచ్చు. కస్టమర్లు ఒకవేళ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ను పార్క్ చేసి లాక్ చేయడం మర్చిపోయినట్లయితే, వారి స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్ సాయంతో తమ స్కూటర్ను ఎక్కడ నుంచి అయినా లాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎక్కవగా నావిగేషన్ ఫీచర్ ఉపయోగిస్తాము. అయితే ఈ ఫీచర్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా తీసుకువచ్చింది. కావున రైడర్ ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. డ్యాష్బోర్డులోని నావిగేషన్ యాప్లో టైప్ చేస్తే, అది గమ్యం చేరేదాకా టర్న్ బై టర్న్ డైరెక్షన్స్ను చూపిస్తుంది.

మూవ్ ఓఎస్ 2.0 అప్డేట్ ద్వారా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. కావున రైడర్లు JioSaavn, Spotify వంటి యాప్ల ద్వారా రైడింగ్ సమయంలో కూడా తమకు ఇష్టమైన పాటలను వింటూ రైడ్ చేయవచ్చు. స్కూటర్లో అమర్చిన రెండు 10 వాట్ స్పీకర్ల సాయంతో మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. మొత్తం మీద కంపెనీ అందించిన ఈ కొత్త అప్డేట్ ద్వారా ఇప్పుడు వాహన వినియోగదారుడు మరింత అద్భుతమైన ఫీచర్స్ అనుభవించవచ్చు.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా విక్రయించబడుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఈ కొత్త మూవ్ ఓఎస్ 2.0 అప్డేట్ తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఇది వాహన వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున కస్టమర్లు ఇప్పుడు త్వరలోనే ఈ అప్డేట్ మారిపోతారు.


Click it and Unblock the Notifications








