ఆన్లైన్ వద్దు.. షోరూమ్లే ముద్దు..: దేశవ్యాప్తంగా 200 షోరూమ్లను ఏర్పాటు చేయనున్న ఓలా ఎలక్ట్రిక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్గా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఇప్పుడు తన అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు కష్టపడుతోంది. ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
Recommended Video
దేశంలోని అనేక వాహన తయారీదారులు తమ ఉత్పత్తులను నేరుగా షోరూమ్లు, డీలర్ల ద్వారా విక్రయిస్తుంటే, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఆన్లైన్ సేల్ మరియు డోర్ డెలివరీ విధానానికి తెరలేపింది.

మొదట్లో ఈ ప్రక్రియ సజావుగానే సాగినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో చాలనే సమస్యలు ఎదురయ్యాయి. కస్టమర్లు ముందుగానే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీలో మాత్రం భారీ జాప్యం జరగడం, డిజిటల్ పేపర్ వర్క్ సరిగా లేని కారణంగా డెలివరీలు వాయిదా పడటం, స్కూటర్లో సర్వీస్ సంబంధిత సమస్యలు వస్తే త్వరగా పరిష్కరించకపోవడం వంటి ఫిర్యాదులా చాలానే వచ్చాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఓలా తన మనుగడను సాగించేందుకు ఇప్పుడు పాత పద్ధతికే వచ్చింది. దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని కొనుగోలుదారులు స్వాగతిస్తున్నారు. ఓలా ఇప్పటికైనా మేల్కొందని, ఇకనైనా కస్టమర్ సమస్యలు త్వరగా పరిష్కరించబడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో పోటీ నానాటికీ పెరుగుతోంది. దేశంలోకి అనేక కొత్త ఇ-టూవీల్ బ్రాండ్లు ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓలా ఇప్పటికీ ఆన్లైన్ విక్రయాల పద్ధతినే పాటిస్తే చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో తన మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కూడా ఇదే విషయాన్ని అధ్యయనం చేసి, ఇప్పుడు నేరుగా కస్టమర్లను కలుసుకోవడానికి మరియు వారికి తమ స్కూటర్ను పరిచయం చేయడానికి షోరూమ్ పద్ధతిని పాటించాలని నిర్ణయించుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి (మార్చ్ 2023) నాటికి దేశవ్యాప్తంగా 200 షోరూమ్లను ప్రారంభించాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం, ఆన్లైన్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ ప్రతి నెలా సగటున 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. అయితే, ఆన్లైన్ ద్వారా స్కూటర్ను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆన్లైన్ సేల్స్ మరియు సర్వీస్ పట్ల కస్టమర్లలో అవగాహన లేకపోవడం లేదా వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటం వంటి పలు కారణాల వలన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలని కస్టమర్లకు ఆసక్తి ఉన్నప్పటికీ, అలాంటి వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే చెన్నై, ఛత్తీస్గఢ్, బెల్గాం, ఢిల్లీ, కొల్హాపూర్, మంగళూరు, పూణే మరియు త్రిస్సూర్ నగరాల్లో మొత్తం 20 షోరూమ్లను ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ షోరూమ్లకు "ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్" అని పిలుస్తోంది. పేరుకు తగినట్లుగానే ఇవి అనుభవ కేంద్రాలు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ నిర్వాహకులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తారు మరియు టెస్ట్ రైడ్ లను కూడా ఆఫర్ చేస్తారు. ఫలితంగా, కస్టమర్లకు స్కూటర్ కొనడానికి ముందే, దాని గురించి ఓ ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది.

ఓలా ఎక్స్పీరియెన్స్ సెంటర్లు వారానికి 7 రోజులు ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఈ ఎక్స్పీరియెన్స్ సెంటర్లలో ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో మోడళ్లు ప్రదర్శించబడుతాయి. కస్టమర్లు, ఈ షోరూమ్ల నుండి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు మరియు దాని కోసం అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ షోరూమ్ల నుండే ఓలా స్కూటర్లను కూడా బుక్ చేసుకోవచ్చు.

మెట్రో నగరాలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. కాబట్టి, కంపెనీ తమ కొత్త షోరూమ్లను టైర్ 2 నగరాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఆన్లైన్ విక్రయాలు జోరుగానే సాగుతున్నప్పటికీ, చాలా మంది వినియోగదారులు షోరూమ్ ఆధారిత విక్రయాలను ఇష్టపడతారు. తాము ఖర్చు చేస్తున్న ఉత్పత్తిని నేరుగా చూసి, టెస్ట్ రైడ్ చేయాలనుకుంటారు. భవీష్ ట్విటర్లో నిర్వహించిన పోల్లో కూడా చాలా మంది షోరూమ్ విక్రయాలనే ఇష్టపడుతున్నట్లు తేలింది.

కాబట్టి, ఇలా షోరూమ్లను తెరవడం వల్ల కస్టమర్లు నేరుగా షోరూమ్కి వెళ్లి స్కూటర్ను కొనుగోలు చేసిన అనుభూతిని పొందవచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ పై కస్టమర్ల విశ్వసనీయతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఆన్లైన్ ద్వారా ఓలా స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లలో చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి షోరూమ్లను ఏర్పాటు చేయడం ద్వారా సదరు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ తమ కస్టమర్ల కోసం ఈ ఏడాది దీపావళికి భారతదేశంలోని 50 ప్రధాన నగరాల్లో 100 హైపర్చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, తమ స్కూటర్ కొనుగోలుదారుల కోసం 5 సంవత్సరాల వారంటీ పథకాన్ని అమలు చేయడాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. కొన్ని నెలల క్రితం ఓలా స్కూటర్లో మంటలు అంటుకోవడం కారణంగా వివాదం చెలరేగడంతో కంపెనీ అమ్మకాలు పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఆ ప్రక్రియలో భాగమే ఈ షోరూమ్ ల ఏర్పాటు అని విమర్శకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








