లీటరు పెట్రోలుకు 240 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కారు
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూస్తుంటే వాహనాల జోలికి వెళ్లాలంటేనే చిరాకు వేస్తుంది కదూ..! ఇలాంటప్పుడు అధిక మైలేజీనిచ్చే కార్లు దొరికితే ఎంత బావుటుందో అనిపిస్తుంది కదూ..! ఇదే ఆలోచన బెంగుళూరులోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థుల మదిలో మెదిలిందే. అంతే.. ఒక్క లీటరు ఇంధనంతో 240 కి.మీ. పరుగులు పెట్టే కారును సృష్టించి అందరి మెప్పను పొందారు.
బెంగుళూరులోని సర్ ఎమ్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్విఐటి)కు చెందిన 11 మంది విద్యార్థుల బృందం (వీరి బృందం పేరు టీమ్ ఇన్ఫెర్నో) 240 కెఎమ్పిఎల్ మైలేజీనిచ్చే కారును తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు.. కాన్సెప్ట్ కారుతో మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జులై 4 నుండి 7వ తేదీ వరకు జరగనున్న షెల్ ఎకో మారథాన్లో పాల్గొనేందుకు వారు అర్హత దక్కించుకున్నారు.
ఈ మారథాన్కు ఇండియా నుండి ఎంపికైన 12 బృందాలలో టీమ్ ఇన్ఫెర్నో కూడా ఒకటి. టీమ్ ఇన్ఫెర్నో విద్యార్థులు రూపొందించిన ఈ కారుకు 'ద్రోనా' అనే పేరును పెట్టారు. ఏషియాలో 150 ఇతర బృందాలు తయారు చేసిన కాన్సెప్ట్ కార్లతో ద్రోనా కారు తలపడనుంది.
వాస్తవానికి ఈ ద్రోనా కారు ప్రాజెక్టును గడచిన సంవత్సరంలో సెప్టెంబర్లో అనుకున్నామని, అసలు పని మాత్రం ఫిబ్రవరిలో ప్రారంభమైందని టీమ్ ఇన్ఫెర్నోకు చెందిన మొదటి సంవత్సరం మెకానికల్ విద్యార్థి తెలిపాడు. సూపర్ మైలేజీనిచ్చే కారును అభివృద్ధి చేయాలని తాము నిర్ణయించుకున్నామని, ఈ కాంపిటీషన్కు అవసరమైన వాటిళ్లో మైలేజ్ కూడా ప్రధానమైన అంశమని సదరు విద్యార్థి తెలిపాడు.
ద్రోనా కాన్సెప్ట్ కారులో ఒక్క వ్యక్తి (డ్రైవర్)కి మాత్రమే చోటు ఉంటుంది. మోడిఫై చేయబడిన బజాజ్ ఇంజన్, అల్యూమినియం షాషీ (ఛాస్సిస్), ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్, ఏరోడైనమిక్ డిజైన్, డైరెక్ట్ ట్రాన్సిమిషన్ వంటి వాటి ద్వారా ఇంత అధిక సంఖ్యలో మైలేజ్ను పొందడం సాధ్యమైందని విద్యార్థులు తెలిపారు. గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్డ్ ప్లాస్టిక్ బాడీని ఉపయోగించి తయారు చేసిన ద్రోనా కారు గరిష్టంగా గంటకు 60 కి.మీ. వేగంతో పరుగులు పెట్టనుంది. దీనిని తయారు చేయటానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశామని అవినాష్ తెలిపాడు. మరి మలేషియా వెళ్లనున్న ఈ విద్యార్థుల బృందాని (టీమ్ ఇన్ఫెర్నో)కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా..!!


Click it and Unblock the Notifications








