ప్రభుత్వానికి పంగనామం: బిఎమ్డబ్ల్యూ కారుకి బైక్ నెంబర్
కొందరికి కోట్ల రూపాయల ఆస్తులున్నా కక్కుర్తి మాత్రం పోదు. పన్నులు ఎగ్గొట్టి, ప్రభుత్వానికి పంగనామాలు పెట్టేందుకు పలువురు డబ్బున్న ప్రబుద్ధులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ సంఘటనలో దేశ ఐటి రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది. బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ లియాల్టర్ తన హై-ఎండ్ బిఎమ్డబ్ల్యూ కారుకు టూవీలర్ నెంబర్ ప్లేట్ ఉపయోగించి, నగర రోడ్లపై సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. గడచిన రెండేళ్లుగా ఆమె ఈ కారును టూవీల్ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఉపయోగిస్తుంది. తన తప్పును పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఆమె ఈ నెంబర్ ప్లేట్ను చాలా చిన్న అక్షరాలతో చేయించుకుంది.
ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆమె కారును సీజ్ చేసి ఆర్టీవోకు తరలించారు. కోరమంగళకు చెందిన మంజుల అనే రియాల్టర్ రెండేళ్ల క్రితం ఓ బిఎమ్డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. అప్పటి నుండి ఆమె సదరు కారును రిజిస్ట్రేషన్ చేయించకుండా, దానికి ఓ పాత టూవీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ను అటు ప్రభుత్వం, ఇటు ట్రాఫిక్ పోలీసుల కన్ను కప్పి తిరుగుతోంది. పన్ను ఎగవేత వేసే వారిపై ఆర్టీవో నిర్వహించిన ఓ స్పెషల్ డ్రైవ్లో మంజుల చేసిన మోసం బయపడిపోయింది. దీంతో సదరు కారు యజమానికి కోర్టు రూ.6.2 లక్షల జరిమానాను విధించింది.

సాధారణంగా లగ్జరీ కార్ కొనుగోలుదారులంతా కార్లను పాండిచ్చేరిలో పన్నులు తక్కువగా ఉంటాయని అక్కడే రిజిస్టర్ చేయిస్తుంటారు. కర్ణాటకలో రోడ్ టాక్సులు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు కర్ణాటకలో రూ.10 లక్షలు అంతకుమించిన కారును కొనుగోలు చేసినట్లయితే, కారు విలువలో 20 శాతాన్ని లైఫ్ టైమ్ రోడ్ టాక్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా కోటి రూపాయల కారును కొనుగోలు చేస్తే రోడ్ టాక్స్గా రూ.20 లక్షలు వదిలించుకోవాల్సి ఉంటుంది. ఈ కారణం చేతనే చాలా మంది బడా బాబులు పన్ను ఎగ్గొట్టేందుకు ఇలాంటి అడ్డదార్లు తొక్కుతుంటారు.


Click it and Unblock the Notifications








