మారుతి సుజుకి ఎర్టిగాకు పోటీగా ఫియట్ కొత్త ఎమ్పివి
మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్పివి) ఎర్టిగాకు పోటీగా ఫియట్ ఓ సరికొత్త ఎమ్పివిని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇటలీకు చెందిన కార్ కంపెనీ ఫియట్ ఇటీవలే తమ పాపులర్ 'ఫియట్ పుంటో' చిన్న కారు ఫ్లాట్ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన సరికొత్త 'ఫియట్ 500ఎల్' హ్యాచ్బ్యాక్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పుడు తాజాగా, ఫియట్ 500ఎల్ హ్యాచ్బ్యాక్ ఫ్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని ఓ సరికొత్త ఎమ్పివిని ఫియట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో టాటా మోటార్స్ డీలర్షిప్ భాగస్వామ్యం నుంచి ఫియట్ విడిపోయిన తర్వాత, ఇక్కడి మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే, సరికొత్త మోడళ్లను ఇండియన్ మార్కెట్కు పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఫియట్ ఇండియా భారత మార్కెట్లో రెండు మోడళ్లను మాత్రమే (ఫియట్ లీనియా సెడాన్, ఫియట్ పుంటో హ్యాచ్బ్యాక్) ఆఫర్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ విపణిలో మల్టీ పర్సస్ వెహికల్స్ (ఎమ్పివి)లకు డిమాండ్ జోరందుకోవడంతో ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాలని ఫియట్ భావిస్తున్నట్లు సమాచారం. ఫియట్ ఎమ్పివి 7-సీట్లను కలిగి ఉండి, ఎర్టిగా వంటి ఎమ్పివిలకు పోటీ ఇవ్వనుంది.
ఫియట్ 500ఎల్ హ్యాచ్బ్యాక్ ఆధారంగా రానున్న ఫియట్ ఎమ్పివిలో 1.3లీటర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్ను ప్రస్తుతం మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివిలో కూడా ఉపయోగించడం జరుగుతోంది. ఫియట్ తమ కొత్త ఎమ్పివిని ఎక్కువ శాతం ఇండియన్ మార్కెట్లోనే లోకలైజేషన్ చేసినట్లయితే దీని ధర కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అయితే, ఇండియన్ మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయిన 500 హ్యాచ్బ్యాక్ కారు ఆధారంగా వస్తున్న ఈ మోడల్ ఇక్కడి మార్కెట్లో ఎంత మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications









