బెంగుళూరులో సరికొత్త రేవా ప్లాంట్ను ప్రారంభించిన మహీంద్రా
మహీంద్రా రేవా నుంచి మార్కెట్లోకి రానున్న ఎలక్ట్రిక్ కారు రేవా ఎన్ఎక్స్ఆర్ ఉత్పత్తి కోసం కంపెనీ ఓ అత్యాధునిక ప్లాంటును బెంగుళూరులో ప్రారంభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌరశక్తిని ఉపయోగించి ఈ ప్లాంటును నిర్మించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్లాంటు నిర్వహణకు కావల్సిన విద్యుత్తులో సుమారు మూడవ వంతు భాగం సౌరశక్తి ద్వారానే గ్రహించబడుతుంది.
ప్రస్తుతం ఈ మహీంద్రా రేవా ప్లాంట్లో రేవా ఎన్ఎక్స్ఆర్ ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారును మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్లో సంవత్సరానికి 30,000 కార్లను ఉత్పత్తి చేయనున్నారు. మరో రెండు నెలల్లోగా తమ రేవా ఎన్ఎక్స్ఆర్ కారును మార్కెట్లోకి తీసుకువస్తామని, విడుదల సమయంలోనే దీని ధర, స్పెసిఫికేషన్లు, తదితర వివరాలను వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

బెంగుళూరులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కోసం సుమారు రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేశామని, మరో రెండు వారాల్లో ఈ ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయ పడ్డారు. అలాగే, డీజిల్ వాహనాలపై ఎక్సైజ్ సుంకాలు పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు.
మహీంద్రా రేవా ప్లాంట్కు ఇటీవలే ప్రతిష్టాత్యక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) ప్లాటినం రేటింగ్ కూడా లభించింది. దీంతో ఈ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి భారత ఆటోమొబైల్ తయారీ ప్లాంట్గా మహీంద్రా రేవా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో అత్యున్నతస్థాయి ప్రమాణాలు పాటించే సంస్థగా తమకు ఈ రేటింగ్ లభించడం గర్వకారణమని మహీంద్రా రేవా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
రానున్న రోజుల్లో తమ భవిష్యత్ ప్రాజెక్టులను సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని కంపెనీ తెలిపింది. చేతన్ మయానీ స్థాపించిన బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రేవాను మహీంద్రా అండ్ మహీంద్రా రేండేళ్ల క్రితం స్వాధీనం చేసుకుంది. ఈ ప్లాంటులో దాదాపు అన్ని వస్తువులను రీసైకిల్ చేసి, తిరిగి మళ్లీ వాటిని ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








