ఆంధ్రప్రదేశ్లో మహీంద్రా అండ్ మహీంద్రా చిన్న కార్ ప్లాంట్
భారతదేశపు అతిపెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై కన్నేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్న కార్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఎమ్ అండ్ ఎమ్ యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ డిజైన్ సిద్ధంగా ఉందని, ప్రస్తుతం తాము వివిధ అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుంటున్నామని కంపెనీ అధికారులు వెల్లడించారు.
కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటులో చిన్న కార్లు, కొన్ని ఇతర ఉత్పత్తులను తయారు చేయనున్నారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్లోని మెదక్ జిల్లాలో ఉన్న జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ట్రాక్టర్ ప్లాంటును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అదే రోజున తమ కార్ ప్లాంట్కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించే ఆస్కారం ఉంది. ఈ ట్రాక్టర్ ప్లాంటులో జనవరి రెండవ వారం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రాక్టర్ ప్లాంట్లలో ఒకటి.
రూ.300 కోట్ల పెట్టబడితో నిర్మించిన ఆఈ ప్లాంటులో రోజుకు 300 వాహనాలు ఉత్పత్తి అవుతాయి. స్కూటర్ల నుంచి ట్రాక్టర్ల వరకూ వివిధ రంగాల్లో ఉత్పత్తులను అందిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, అత్యంత పోటీ మరియు అధిక అవకాశాలతో కూడిన చిన్న కార్ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, 1000సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉండి, రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల ధరల శ్రేణిలో ఓ చిన్న కారును విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications








