జనవరి నుంచి కార్ల ధరలను పెంచనున్న మారుతి సుజుకి
కొత్త సంవత్సరంలో మీరు కొత్త మారుతి సుజుకి కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ ప్లాన్స్ మానుకొని ఈ నెలలోనే కొత్త కారును కొనేసుకోవటం మంచిది. ఎందుకంటే, దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా రానున్న జనవరి నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనుంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను రూ.20,000 మేర పెంచనున్నట్లు మారుతి సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా తమ మార్జిన్లపై ఒత్తిడి అధికమవుతున్న కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ వివరించింది.
"ఉత్పత్తుల ధరల్లో పెంపు ఉంటుంది. ఈ పెంపు పరిమాణం మోడల్ను బట్టి వేర్వేరుగా ఉంటుంది, ఇది సుమారు రూ.20,000 వరకూ ఉంటుంద"ని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు. భారత మార్కెట్లో మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కారు ఎమ్800 మొదలుకొని లగ్జరీ సెడాన్ కిజాషి వరకూ వివిధ మోడళ్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.2.09 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.17.52 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయి.



Click it and Unblock the Notifications








