కిజాషిపై రూ.5 లక్షల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్న మారుతి సుజుకి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'కిజాషి'పై కంపెనీ భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి కిజాషి అమ్మకాలు అశించిన రీతిలో సాగకపోవటంతో, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ దీనిపై ఏకంగా రూ.5 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. గడచిన ఆగస్టు నెలలో ఒక్క కిజాషి కారు కూడా అమ్మడుపోలేదు. దీంతో కంపెనీ సెప్టెంబర్ నెలలో ఈ కారుపై రూ.3 లక్షల తగ్గింపును ఆఫర్ చేసింది. అయినప్పటికీ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి.

మారుతి సుజుకి తమ కిజాషి లగ్జరీ సెడాన్ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అందుకే దేశీయ విపణిలో ఈ కారు ధర కూడా కాస్తంత అధికంగానే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ కారును దిగుమతి చేసుకోవటాన్ని కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం మార్కెట్లో డీలర్ల వద్ద ఉన్న కిజాషి సెడాన్ స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ఈ మోడల్పై కంపెనీ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. మారుతి సుజుకి కిజాషి ప్రీమియం సెడాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్, డిఓహెచ్సి ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్ల శక్తిని, 230 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.53 కి.మీ. మైలేజీని ఇవ్వగా, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 205 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.45 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ని కంపెనీ పేర్కొంది. ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, వోల్క్స్వ్యాగన్ జెట్టా, స్కొడా లారా వంటి లగ్జరీ కార్లకు పోటీగా మారుతి సుజుకి కిజాషిని ప్రవేశపెట్టింది. రాష్ట్ర మార్కెట్లో కిజాషి ధరలు (డిస్కౌంట్కు ముందు) ఇలా ఉన్నాయి.
మారుతి సుజుకి కిజాషి ధరలు:
* మారుతి సుజుకి కిజాషి (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) - రూ.16.88 లక్షలు
* మారుతి సుజుకి కిజాషి (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) - రూ.17.90 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








