మిత్సుబిషి పాజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాన్సర్ డీజిల్ చాప్టర్ క్లోజ్
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి భారత మార్కెట్లో అందిస్తున్న పాజెరో ఎస్ఎఫ్ఎక్స్ ఎస్యూవీ, ల్యాన్సర్ డీజిల్ సెడాన్ల చాప్టర్ క్లోజ్ కానుంది. దేశీయ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్తో కలిసి ఇక్కడి మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిత్సుబిషి ఈ రెండు మోడళ్లను భారత్లో అసెంబ్లింగ్ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. మరికొద్ది నెలల్లో డీలర్ల వద్ద ఉన్న ఈ మోడళ్ల స్టాక్ క్లియర్ కానుంది.
మిత్సుబిషి ఇటీవలే విడుదల చేసిన పాజెరో స్పోర్ట్ ఎస్యూవీ ఉత్పత్తిలో లోకలైజేషన్ శాతాన్ని పెంచడం వలన ఈ మోడల్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పాజెరో స్పోర్ట్, పాజెరో ఎస్ఎఫ్ఎక్స్ రెండు మోడళ్ల ధర ఇంచు మించు సమానమైనట్లయింది. దీనికితోడు మిత్సుబిషి పాజెరో ఎస్ఎఫ్ఎక్స్ పాత మోడల్ కావటంతో, దీనిపై కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎస్యూవీని పూర్తిగా ఇండియన్ మార్కెట్ను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ల్యాన్సర్ డీజిల్ సెడాన్ కూడా పాత మోడల్ కావటంతో ఈ కారును కొనేందుకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు.







అయితే, ప్రస్తుత ల్యాన్సర్ డీజిల్ సెడాన్ స్థానంలో సరికొత్త ల్యాన్సర్ను ప్రవేశపెట్టే విషయంపై కంపెనీ నోరు విప్పలేదు. ఏదేమైనప్పటికీ, భవిష్యత్తులో ఇందులో ఓ సరికొత్త అప్గ్రేడెడ్ వెర్షన్ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. కాబట్టి, తక్కువ ధరకే ఈ మోడళ్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే అనువైన సమయం. ప్రస్తుతం ఈ మోడళ్ల స్టాక్ క్లియర్ చేసుకునేందుకు డీలర్లు ఆకర్షనీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. బేరమాడితే మీకు కూడా మంచి డిస్కౌంట్ లభించవచ్చు.. మరి మీ ప్లాన్స్ ఏంటి..?


Click it and Unblock the Notifications








