ఆస్టన్ మార్టిన్ కొనుగోలు రేసులో టాటా మోటార్స్ కూడా..
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్లో వాటాల అమ్మకం గురించి ఇప్పుడు గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిందే. ఈ వాటాలను కొనుగోలు రేస్లో ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ముందంజలో ఉన్నట్లు ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారును టాటా నానోను తయారు చేసి రికార్డు సృష్టించిన మరో భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఈ రేస్లోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
ఆస్టన్ మార్టిన్ యొక్క కువైటీ యజమానులు కంపెనీలోని తమ మెజారీటీ వాటాలను విక్రయించేందుకు పటిష్టమైన కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్టన్ మార్టిన్లో దాదాపు 64 శాతం వాటా కలిగిన 'ఇన్వెస్టిమెంట్ డార్' ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఈ కంపెనీ ఆస్టన్ మార్టిన్లో ఉన్న తమ వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. ఈ విక్రయంపై తమకు సలహా ఇచ్చేందుకు గాను 'రోథ్స్ఛైల్డ్'ను ఇన్వెస్టిమెంట్ డార్ తమ సలహాదారుగా నియమించుకుంది.
ఈ వాటాల అమ్మకం విషయంపై గడచిన కొద్ది నెలలుగా పలు పటిష్టమైన కొనుగోలుదారులతో ప్రత్యేక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా ఆస్టన్ మార్టిన్లోని వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు కంపెనీని ఉటంకిస్తూ.. బర్మింగ్హామ్పోస్ట్ ఓ కథనంలో ప్రచురించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు కానీ ప్రకటనలు కానీ వెలువడ లేదు. గడచిన ఐదేళ్ల క్రితం ఆస్టన్ మార్టిన్ను కొనుగోలు చేసిన ధరకే ఈ వాటాలను విక్రయించాలని ఇన్వెస్టిమెంట్ డార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇన్వెస్టిమెంట్ డార్ 2007లో 800 మిలియన్లను వెచ్చించి ఈ వాటాలను కొనుగోలు చేసింది. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.4,400 కోట్లు. అయితే, ఇన్వెస్టిమెంట్ డార్తో సంబంధం ఉన్న అధికారుల సమాచారం ప్రకారం, ఈ సంస్థ తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ వాటాల అమ్మకం ఒక్క మార్గమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఇప్పటికే బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను సొంతం చేసుకొని ఉండటంతో తాజాగా ఆస్టన్ మార్టిన్ను కూడా కొనుగోలు చేసినట్లయితే, ఈ రెండు లగ్జరీ కంపెనీల మధ్య టెక్నాలజీని పంచుకునేందుకు వీలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications









