డీజిల్ ధర పెంపు; జోరందుకున్న పెట్రోల్ కార్ల అమ్మకాలు
పెట్రోల్ కార్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయ్. ఓవైపు పండుగ సీజన్ నేపథ్యంలో కార్ కంపెనీలు పెట్రోల్ కార్లపై భారీ తగ్గింపులు, ప్రోత్సాహకాలను అందించడం మరోవైపు సర్కారు డీజిల్ ధరలను పెంచడంతో పెట్రోల్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, అక్టోబర్ నెలలో పెట్రోల్ కార్ల అమ్మకాలు ఫర్వాలేదనిపించాయి. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాలలో డీజిల్ కార్ల వాటా 57 శాతం ఉండగా, గడచిన నెలలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 3-5 శాతం వృద్ధిని సాధించి మొత్తమ్మీద 46-48 శాతానికి పెరిగాయి.
పరిశ్రమ నిపుణుల సమాచారం ప్రకారం, మందగించిన పెట్రోల్ కార్ల అమ్మకాలు పెరగటానికి పండుగ సీజన్ తోడ్పడగా, దీనికి గడచిన సెప్టెంబర్ నెల మధ్య భాగంలో పెరిగిన డీజిల్ ధర (లీటరుపై రూ.5) మరింత ఊతమిచ్చింది. గత కొద్ది నెలలుగా నెమ్మదిగా సాగుతున్న పెట్రోల్ కార్ల అమ్మకాలు అక్టోబర్ నెలలో మాత్రం పుంజుకున్నాయి. ఈ సమయంలో మారుతి సుజుకి స్విఫ్ట్, నిస్సాన్ మైక్రా, స్కొడా ఫ్యాబియా, టొయోటా ఎతియోస్ లివా వంటి హ్యాచ్బ్యాక్లతో పాటుగా హ్యుందాయ్ ఇయాన్, మారుతి ఆల్టో 800 వంటి పాపులర్ పెట్రోల్ కార్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి.

ఈ సందర్భంగా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) పి సందీప్ సింగ్ మాట్లాడుతూ, పెట్రోల్ కార్ల యొక్క ఆకర్షనీయమైన ధరలే అమ్మకాలు పెరగటానికి ప్రధాన కారణమని తెలిపారు. పెట్రోల్ కార్ల అమ్మకాలు పెరగడంలో రూ.3 లక్షల రేంజ్లో ధర కలిగిన మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ వంటి మోడళ్లు కీలక పాత్రను పోషించాయి. మొత్తమ్మీద చూసుకుంటే, రానున్న రోజుల్లో మళ్లీ పెట్రోల్ కార్ల ట్రెండే కొనసాగేలా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








