మోరాయించిన రాష్ట్రపతి బెంజ్.. తిరిగి అంబాసిడర్ కారే గతి!
ఇటీవల భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి కేటాయించిన మెర్సిడెస్ బెంజ్ కారు ఇప్పుడు ముందుకెళ్లనని మొండికేస్తోంది. రాష్ట్రపతి కోసం అధికారిక వాహనంగా 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్మ్యాన్ గార్డ్' అనే పొడవాటి కారు (లీమోజైన్)ను భారత సర్కారు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ కారు ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ మెకానిక్ షెడ్డుకు చేరింది.
ఇందులో లోపాలను సవరించిన తర్వాత ఆ కారును మళ్లీ రాష్ట్రపతి వద్దకు వస్తుంది. అప్పటి వరకూ ప్రణబ్ ముఖర్జీకి పాత అంబాసడర్ కారే గతి. మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్మ్యాన్ గార్డ్ను ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో రూపొందించారు. ఊహించని సంఘటనలు, కాల్పులు, గ్రెనేడ్ దాడుల నుంచి కారు లోపలి వ్యక్తులను రక్షించేలా ఈ కారును తయారు చేశారు. దీని విలువ సుమారు ఆరు కోట్ల రూపాయలు.
ప్రణబ్ ముఖర్జీకి ప్రభుత్వం ఇంత పొడవు కారను ఇచ్చినప్పటికీ, తనకు మాత్రం అంబాసిడర్లో వెళ్లటమే ఇష్టమని గతంలో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ ఎస్600ఎల్ పుల్మ్యాన్ గార్డ్లో 12 సిలిండర్, 5513సీసీ బై-టర్బోఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 517 హెచ్పిల శక్తిని, 830 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఈ కారులో ఎనిమిది ఎయిర్బ్యాగ్లు ఉంటాయి
ఇంకా ఇందులో శాటిలైట్ వ్యవస్థ, ఇంటర్నెట్ కనెక్షన్, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, రాష్ట్రపతితో ముఖాముఖి భేటీ జరిపేలా ఏర్పాటు చేసిన సీట్లు వంటి అనేక ఆధునిక, భద్రతా ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.ప్రమాదకర పరిస్థితులు, అత్యవసర సమయాల్లో ఈ కారు శక్తివంతగా పరుగులు తీస్తుంది. 2010లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో మెర్సిడెస్ బెంజ్ 'ఎస్600ఎల్ పుల్మ్యాన్' కారును ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications








