కొత్త సంవత్సరంలో కాస్ట్లీగా మారనున్న రెనో కార్లు
కొత్త సంవత్సరంలో కొత్త కారును కొనాలనుకునే కార్ ప్రియులకు షాకింగ్ న్యూస్. జనవరి 2013 ఆరంభం నుంచే కార్ల ధరలను పెంచేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ధరల పెంపుపై ఇప్పటికే పలు కార్ కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా కూడా వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పతనమవుతున్న రూపాయి మారకపు విలువ, పెరుగుతున్న ఇంధన మరియు ఇన్పుట్ ధరలే ఈ ధరల పెంపుకు కారణమని కంపెనీ పేర్కొంది.
భారత మార్కెట్లో రెనో ఇండియా అందిస్తున్న పల్స్ హ్యాచ్బ్యాక్, స్కాలా మిడ్-సైజ్ సెడాన్, డస్టర్ ఎస్యూవీ, ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్, కొలియోస్ ప్రీమియం ఎస్యూవీ మోడళ్లపై 1.5 శాతం వరకూ ధరలను పెంచనుంది. దేశీయ విపణిలో రెనో కార్ల ధరలు రూ.4.27 లక్షల (రెనో పల్స్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర) నుంచి రూ.23 లక్షల (రెనో కొలియోస్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర) రేంజ్లో ఉన్నాయి.

రెనో పల్స్

రెనో స్కాలా

రెనో డస్టర్

రెనో ఫ్లూయెన్స్

రెనో కొలియోస్
ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా, జనరల్ మోటార్స్, హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ ఇండియా వంటి కార్ కంపెనీలు వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. కేవలం ప్యాసింజర్ కార్ కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి ఇండియా, బిఎమ్డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఇదే నెపంతో ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తమ్మీద కొత్త సంవత్సరంలో కొత్త కార్లు కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపనున్నాయి.


Click it and Unblock the Notifications








