ఫాంటమ్ సిరీస్ 2ని భారత్లో విడుదల చేసిన రోల్స్ రాయిస్
లగ్జరీ కార్ ప్రియులకు రోల్స్ రాయిస్ బ్రాండ్ గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ఈ బ్రాండ్ భారత్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్లలో ఒకటి. ఒక వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండే రోల్స్ రాయిస్ తాజాగా భారత మార్కెట్లో మరో సరికొత్త కారును విడుదల చేసింది.
గ్లోబల్ మార్కెట్లో కంపెనీ ఆఫర్ చేస్తున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ 2 (Phantom Series II) కారును కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. గడచిన 2003వ సంవత్సరంలో రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఫాంటమ్ కారుకు అప్గ్రేడెడ్ వెర్షనే ఈ ఫాంటమ్ సిరీస్ 2. పాత ఫాంటమ్తో పోల్చుకుంటే, కొత్త ఫాంటమ్లో అనేక రకాల సాంకేతిక మార్పులు, సరికొత్త ఫీచర్ల మేళవింపులను గమనించవచ్చు.
కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ 2లో సరికొత్త ఎల్ఈడి హెడ్లైట్స్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీస్, శాటిలైట్ నావిగేషన్, ఫ్రంట్, రియర్, టాప్ వ్యూ కెమెరాలు ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు. ఫాంటమ్ సిరీస్ 2 ధరను రోల్స్ రాయిస్ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ ఇది రూ.4.6 కోట్ల మేర ఉండొచ్చని అంచనా.
భారత్లో మరిన్ని కొత్త షోరూమ్లను ఏర్పాటు చేయటం ద్వారా తమ నెట్వర్క్ను విస్తృతంగా పెంచుకోవాలని భావిస్తున్నామని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ జనరల్ మేనేజర్ (ఏషియా) హెర్ఫ్రైడ్ హాసెనోహ్రల్ తెలిపారు. కొత్త ఫాంటమ్ సిరీస్ 2ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, అది లగ్జరీ కార్ మార్కెట్పై ప్రభావం చూపలేదని, ఫాంటమ్ సిరీస్ 2ను భారతీయ కొనుగోలుదారులు ఆదరిస్తారని చెప్పారు.
రోల్స్ రాయిస్కు ఇండియాలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో షోరూమ్లు ఉన్నాయి. కంపెనీ తమ నాల్గవ షోరూమ్ను ఛండీఘడ్లోను, ఐదవ షోరూమ్ను మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం రోల్స్ రాయిస్ దేశీయ విపణిలో ఘోస్ట్, ఫాంటమ్ మోడళ్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications









