అహ్మదాబాద్లో ఆగస్ట్ 15న 500 ఈ-ఆటోల విడుదల
అహ్మదాబాద్లో సాంప్రదాయ ఇంధనాలతో నడిచే ఆటోరిక్షాలకు బదులు బ్యాటరీ పవర్తో నడిచే ఆటోరిక్షాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అహ్మదాబాద్ ఆటోరిక్షా ఛాలక్ సంఘర్ష్ సమితి (ఏఏఆర్సిఎస్ఎస్) ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్మార్ట్ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్తో చేతులు కలిపి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, స్మార్ట్ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ 500 ఎలక్ట్రిక్ పవర్డ్ ఆటోరిక్షాలను ఏఏఆర్సిఎస్ఎస్కు తయారు చేసి ఇవ్వనుంది.
భారమైపోతున్న సిఎన్జి, పెట్రోల్, డీజిల్ ఖర్చులను తప్పించేందుకే ఈ తరహా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు వర్గాలు ప్రకటించాయి. ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు పూర్తి ఛార్జ్పై సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. పైగా వీటి ఉపయోగం వలన పర్యావరణానికి ఎలాంటి హాని కూడా జరగదు. ఇలాంటి ఆటోరిక్షాలలో ప్రయాణించే ప్రయాణికులు కూడా పెరుగుతున్న ఆటో ధరల బారి నుండి తప్పించుకోవచ్చు.
జపనీస్ సంస్థ మైవే మరియు భారతీయ కంపెనీ జింటెల్ వరల్డ్ల జాయింట్ వెంచర్ కంపెనీ అయిన స్మార్ట్ గ్రిడ్ ఈ ఏడాది జులై నెలాఖరు నాటికి 500 ఈ-ఆటోలను ఏఏఆర్సిఎస్ఎస్కు డెలివరీ చేయనుంది. వీటిని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15, 2013)న లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సిఎన్జితో నడిచే ఆటోలకు కిలోమీటరుకు రూ.2 నుంచి రూ.2.25 మధ్యలో ఖర్చు అవుతుండగా, ఈ-ఆటోలకు కిలోమీటరుకు కేవలం 50 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. నలుగురు ప్రయాణికులు (1+3) ప్రయాణించగల ఈ-ఆటో ధర రూ.1.60 లక్షల నుంచి రూ.1.75 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. అంతా సజావుగా సాగితే రూ.1.50 లక్షలకే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.



Click it and Unblock the Notifications








