15 శాతం వరకూ పెరిగిన ఆడి లగ్జరీ కార్ల ధరలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు మరింత ప్రియం అయ్యాయి. తమ ఉత్పత్తుల ధరలను 15 శాతం మేర పెంచుతున్నామని, పెరిగిన ధరలు మార్చి 16, 2013 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా పెంపుతో ఆడి క్యూ రేంజ్ ఎస్యూవీల ధరలను 2.5 శాతం వరకూ ప్రియం కాగా, ఆడి ఆర్8, ఆడి ఆర్ఎస్5 వంటి స్పోర్ట్స్ కార్ల ధరలు 15 శాతం వరకూ పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో వివిధ మోడళ్లపై కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీలను పెంచిన నేపథ్యంలో, తమకు వేరే మార్గం లేక ఉత్పత్తుల ధరలను కూడా పెంచాల్సి వస్తోందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. తాము ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్నామని, అందుకే ఆడి కార్లను కొనుగోలుచేసేందుకు తమ వినియోగదారులకు ఆడి ఫైనాన్స్ ద్వారా ఆకర్షనీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

మరోవైపు మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను వచ్చే నెల నుంచి పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో ఎస్యూవీలపై ఎక్సైంజ్ సుంకాన్ని, అలాగే సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో, ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు, మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్న మోడళ్లపై రూ.1-4 శాతం, సిబియూ రూట్లో దిగుమతి చేసుకునే వాహనాలపై 20 శాతం చొప్పును ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ఏప్రిల్ 1, 2013 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. అయితే, ఏయే మోడల్పై ఎంత మేర పెంచునున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. బిఎమ్డబ్ల్యూ ఇండియా కూడా త్వరలోనే ధరల పెంపును ప్రకటించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








