జనవరి-నవంబర్ 2013లో 13 శాతం పెరిగిన ఆడి సేల్స్
భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఆడి ఇండియా దూసుకుపోతుంది. దేశంలో సంపన్నుల సంఖ్య పెరగుతుండటం, లగ్జరీ కార్ కంపెనీలు ఆకర్షనీయమైన ఫైనాన్స్ స్కీమ్లతో కొనుగోలుదారులను ఆకట్టుకోవటంతో పాటుగా తమ నెట్వర్క్ను దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విస్తరించుకోవటంతో, ఈ సెగ్మెంట్లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఓవైపు ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుంటే, ఖరీదైన లగ్జరీ కార్ల అమ్మకాలు వృద్ధి చెందటం గమనార్హం. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా తమ నెట్వర్క్ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. ఆడి ఇండియా తమ లగ్జరీ కార్లను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆడి టెస్ట్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ తరహా కార్యక్రమాలను చిన్న పట్టణాల్లో సైతం నిర్వహించాలని కంపెనీ యోచిస్తోంది.

ఆడి ఇండియా ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 2013 వరకు మొత్తం 9,146 వాహనాలను విక్రయించి 13 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ 8,073 వాహనాలను మాత్రమే విక్రయించింది. మొత్తమ్మీద 2012 సంవత్సరానికి గాను కంపెనీ కేవలం 9003 యూనిట్లను మాత్రమే విక్రయిచింది. ఈ ఏడాది పూర్తయ్యే సరికి మొత్తం 10,000 యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నానమని కంపెనీ పేర్కొంది.
ఇదిలా ఉండగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఉత్పత్తి వ్యయం పెరగుతున్న నేపథ్యంలో, వచ్చే జనవరి 2014 నుంచి కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ తాజా పెంపు కొత్త సంవత్సరంలో అమ్మకాలపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








