జనవరి నుంచి ప్రియం కానున్న బిఎమ్డబ్ల్యూ కార్ల ధరలు
కొత్త సంత్సరంలో కొత్త కార్లు మరింత ప్రియం కానున్నాయి. అందులోను విలాసవంతమైన కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్డబ్ల్యూ ఇండియా వచ్చే ఏడాది ఆరంభంలో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది.
స్థిరమైన లాభదాయక వృద్ధి సాధించే వ్యూహంలో భాగంగా ధరలను పెంచుతున్నామని బీఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సార్ వెల్లడించారు. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన పిదపే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని, ఈ పెంపు దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా.. జనవరి 1, 2014వ తేది నుంచి అన్ని రకాల బిఎమ్డబ్ల్యూ కార్ల ధరలతో పాటు మినీ బ్రాండ్ కార్ల ధరను కూడా పెంచనున్నారు. ఈ ధరల పెంపు శ్రేణి మోడల్ను బట్టి 7 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంటుందని ఆయన వివరించారు.

బిఎమ్డబ్ల్యూ ఇండియా ఈ ఏడాది ఆగస్టులో రూపాయి విలువ పతనం నెపంతో కార్ల ధరలను 5 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ బిఎమ్డబ్ల్యూ భారత మార్కెట్లో 1 సిరీస్, 3 సిరీస్, 5 సిరీస్, 6సిరీస్, 7 సిరీస్ లగ్జరీ సెడాన్లను, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్యూవీలను మరియు ఎమ్ సిరీస్ స్పోర్ట్స్ కార్లతో పాటుగా, మినీ బ్రాండ్ కార్లను విక్రయిస్తోంది.
దేశీయ విపణిలో బిఎమ్డబ్ల్యూ కార్ల ధరలు రూ.20.9 లక్షల నుంచి రూ.1.78 కోట్ల రేంజ్లో ఉండగా, కంపెనీ అందిస్తున్న లగ్జరీ కాంపాక్ట్ కారు మినీ బ్రాండ్ ఉత్పత్తుల ధరలు రూ.23.7 లక్షల నుంచి రూ.33.2 లక్షల రేంజ్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








