జూన్ నెల నుంచి ప్రియం కానున్న చెవర్లే కార్ల ధరలు
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న చెవర్లే వాహనాల ధరలను భారీగా పెంచనుంది. వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను 1.5 శాతం మేర పెంచుతున్నట్లు జనరల్ మోటార్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. డీజిల్ ధరలో పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు పెంచాల్సిన పరస్థితి ఏర్పడిందని, అందుకే కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.
ఈ మేరకు జూన్ మొదటి వారం నుంచి చెవర్లే ఉత్పత్తులు రూ.10,000 మేర ప్రియం కానున్నాయి. అయితే, ఏయే మోడల్పై ఎంత ధర పెంచాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని, మోడల్ను బట్టి, వేరియంట్ను బట్టి ధరల్లో పెరుగుదల 1.5 శాతం వరకూ ఉంటుందని బాలేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా భారత మార్కెట్లో స్పార్క్, బీట్, సెయిల్ యూవా, సెయిల్, ఎంజాయ్, తవేరా, క్రూజ్, క్యాప్టివా వాహనాలను విక్రయిస్తోంది.
ఈ నెలలో డీజిల్ ధరలు లీటరుకు రూ.1.02 చొప్పును పెరిగిన సంగతి తెలిసినదే. ఈ ఏడాది జనవరి నుంచి ఇలా డీజిల్ ధర పెరగటం ఇది నాల్గవసారి. ప్రతినెలా డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన డీజిల్ కార్లు ఇప్పుడు డీలా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలను పెంచుకునేందుకు ఓవైపు కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటే, జనరల్ మోటార్స్ మాత్రం తమ ఉత్పత్తుల ధరలను పెంచడం గమనార్హంగా ఉంది.



Click it and Unblock the Notifications








