రివర్స్ పంచ్: డీజిల్ కార్ల డిమాండ్ డౌన్, పెట్రోల్ కార్ల పరుగు
భారత మార్కెట్లో ఇప్పటి వరకు డీజిల్ కార్ల ట్రెండ్ నడిచింది. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్కు త్వరలోనే శుభం కార్డు పడనుంది. ప్రతినెలా పెరుగుతున్న డీజిల్ ధరలే ఇందుకు ప్రధానం కారణం. గడచిన జనవరి నెలలో డీజిల్ ధరల నియంత్రణపై భారత ప్రభుత్వం పాక్షికంగా తమ నియంత్రణను ఎత్తివేయటంతో, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతినెలా దీని ధరను స్వల్పంగా పెంచుకుంటూ పోతున్నాయి.
వాస్తవానికి డీజిల్ ఇంధనాన్ని మార్కెట్ ధర కన్నా తక్కువకే సబ్సిడీలో విక్రయిస్తున్నందున, ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై సర్కారుకు 10 రుపాయలకు పైగా నష్టం వాటిళ్లుతున్నట్లు సమాచారం. ఈ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు గాను డీజిల్ ధరపై తన నియంత్రణలను ఉపసంహరించుకోవటం ద్వారా చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ పరిస్థితిని ఇలానే కొనసాగితే కొంత కాలానికి పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరలు దాదాపు సమానంగా మారే అవకాశం ఉంది. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీనిస్తాయి మరియు డీజిల్ ఇంధన ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, వీటి ధర పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వీటిని ఎంచుకునేందుకు సిద్ధపడుతుంటారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. డీజిల్ ధరలు ఇక దిగి రావని, అవి క్రమంగా పెరుగుతుంటాయని వార్త కొనుగోలుదారులకు తెలియడంతో మళ్లీ రివర్సులో పెట్రోల్ కార్లను కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. దీంతో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గి, పెట్రోల్ కార్లకు డిమాండ్ జోరందుకుంది. వాస్తవానికి డీజిల్ కార్లతో పోల్చుకుంటే పెట్రోల్ కార్లు ధర దాదాపు లక్ష రూపాయల వరకూ తక్కువగా ఉండటమే కాకుండా, మెయింటినెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








