మారుతి, టాటా, మహీంద్రాల నుంచి ఎలక్ట్రిక్ టాక్సీలు
భారత సర్కారు తమ నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇదే గనుక జరిగితే, భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు పెరిగి, ఈ తరహా వాహనాల ఉత్పత్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరగే అవకాశం ఉంటుంది.
ఈ ప్రణాళిక ఢిల్లీలోని ఓ పైలట్ ప్రాజెక్ట్తో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఢిల్లీలోని మెట్రో స్టేషన్లకు ప్యాసింజర్లను తరలించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నారు. ఈ ప్రణాళికను భారీ పరిశ్రమల శాఖా మంత్రిత్వ శాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ అంబుజ్ శర్మ ఇటీవల జరిగిన సియామ్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు.

ఈ ఎలక్ట్రిక్ టాక్సీలు 5-6 కిలోమీటర్ల దూరం వరకు సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చినట్లయితే, ఇందులో భాగం పంచుకుని, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ క్యారియర్లను ఆఫర్ చేసేందుకు భారతీయ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మనదేశంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న కంపెనీ మహీంద్రా మాత్రమే.
ప్యాసింజర్ క్యారియర్ సెగ్మెంట్లో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను ఆఫర్ చేయాల్సి వస్తే, కంపెనీ అందిస్తున్న మాక్సిమోలో ఎలక్ట్రిక్ వెర్షన్ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి, టాటా కంపెనీలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కంపెనీలు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ క్యారియర్ సెగ్మెంట్లో ప్రొడక్షన్కు సిద్ధంగా ఉన్న వాహనాలు లేవు.

కానీ, ఈ రెండు కంపెనీలు గతంలో ఇదివరకే, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న మోడళ్లకు ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రదర్శించడం జరిగింది. టాటా మోటార్స్ అందిస్తున్న ఏస్, మ్యాజిక్లలో ఎలక్ట్రిక్ వెర్షన్లను అభివృద్ధి చేయగా, మారుతి సుజుకి అందిస్తున్న ఈకోలో ఎలక్ట్రిక్ వెర్షన్లను కంపెనీ గతంలో పలు ఆటో షోలలో ప్రదర్శనకు ఉంచాయి.
అయితే, ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి పైన తెలిపిన మూడు కంపెనీల్లో ఏ కంపెనీ కూడా అధికారికంగా ధృవీకరణ చేయకపోయిన్పటికీ, ఒక్కసారి సబ్సిడి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2014 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని ఆఫర్ చేయనుంది.



Click it and Unblock the Notifications








