సెడాన్లపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, ఎస్యూవీలపై లేదు!
కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో ఎస్యూవీలపై ఎక్సైజ్ సుంఖాన్ని 30 శాతనికి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. వాస్తవానికి ప్రభుత్వం దృష్టిలో ఎస్యూవీలంటే నాలుగు మీటర్ల కన్నా పొడవును, 1500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యాన్ని, 170 మి.మీ. కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగి ఉన్న వాహనాలన్ని ఎస్యూవీల క్రింద పరిగణించి వాటిపై ఎక్సైజ్ సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి పెంచటం జరిగినది.
ఈ నేపథ్యంలో, పైన తెలిపన విలువలు పాటించే సెడాన్లు కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరాయి. దీంతో ఇందులో కొన్ని రకాల సెడాన్లు కూడా పెంచబడిన ఎక్సైజ్ సుంకం పరిధిలోకి రావటంతో, ఈ విషయంలో స్పష్టతను తీసుకురావాలని, అదనపు ఎక్సైజ్ భారం నుంచి సెడాన్లను తప్పించాలని ఆటోమొబైల్ కంపెనీలు ఆర్థిక మంత్రిని కోరాయి. ప్రస్తుతం ఈ రెండు రకాల (ఎస్యూవీలు, సెడాన్లు) వాహనాలను వర్గీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందుకుగాను టూ-బాక్స్, త్రీ-బాక్స్ కాన్సెప్ట్ను ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఎస్యూవీలను టూ-బాక్స్ వెహికల్స్గాను (సెడాన్ల మాదిరిగా బూట్ స్పేస్ ఉండని వాహనాలు), సెడాన్లను త్రీ-బాక్స్ వెహికల్స్ (ఎక్కువ బూట్ స్పేస్ ఉండే వాహనాలు)గాను వర్గీకరించింది. దీంతో టూ-బాక్స్ వాహనాలపై 30 శాతం ఎక్సైజ్ సుంకం, త్రీ-బాక్స్ వాహనాలపై 27 శాతం ఎక్సైజ్ సుంకం వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ, ఎస్యూవీలపై పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications








