హైదరాబాద్లో ఫియట్ రెండవ డీలర్షిప్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: టాటా మోటార్స్ భాగస్వామ్యం నుంచి విడిపోయి, దేశీయ విపణిలో ఒంటరి ప్రయాణం సాగిస్తున్న ఇటాలియన్ ఆటో దిగ్గజం ఫియట్, భారత్లో తన నెట్వర్క్ను శరవేగంగా విస్తరించుకుంటోంది. ఇందులో భాగంగానే, తాజాగా సికింద్రాబాద్లో మినిష్టర్ రోడ్లో ఫియట్ తమ ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ను ప్రారంభించింది. ఏవీ మోటార్స్ ఫియట్ కార్లకు అధికృత డీలర్గా వ్యవహరించనుంది.
ఫియట్ క్రైస్లర్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేష్ బసవన్హల్లి రాష్ట్రంలో ఈ కొత్త షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75గా ఫియట్ ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ల సంఖ్యను త్వరలోనే 100కు పెంచుకోనున్నామని, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని అన్నారు.

3 ఏళ్లలో 9 కొత్త మోడళ్ల విడుదల
తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్లలో తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వీటిలో కొన్ని రిఫ్రెష్డ్ మోడల్స్, మరికొన్ని కొత్త మోడల్స్ ఉంటాయని నగేష్ తెలిపారు. కంపెనీ ఈ ఏడాది నుంచే కొత్త ఉత్పత్తులను విడుదల చేయటం ప్రారంభిస్తుందని, మరో మూడేళ్ల పాటు ఇది కొనసాగుతుందని ఆయన వివరించారు. ఫియట్ మోడళ్లతో పాటుగా క్రైస్లర్, అబార్త్ బ్రాండ్ మోడళ్లను కూడా విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.
రూపాయి దెబ్బ
రూపాయి విలువ పతనం, ఆటోమొబైల్ మార్కెట్ మందగమనం కంపెనీ సామర్థ్య వినియోగం 60-70 శాతం నుంచి 40 శాతానికి పడిపోయిందని నగేష్ చెప్పారు. టాటా మోటార్స్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్లో లినియా, గ్రాండ్ పుంటో కార్లతో పాటు 1.3 లీటర్ మల్టీ జెట్ డీజిల్ ఇంజన్, 1.2, 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఫియట్ ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications








