ఈకోస్పోర్ట్ బకింగ్స్ ఓపెన్; అడ్వాన్స్ అమౌంట్ రూ.50,000
దాదాపు ఏడాదికి పైగా నిరీక్షణ మరికొద్ది రోజుల్లోనే ఫలించనుంది. అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల కానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియా డీలర్లు ఈకోస్పోర్ట్ కోసం బుకింగ్లను ప్రారంభించారు. కేవలం రూ.50,000 అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించి బుకింగ్లను అంగీకరిస్తున్నారు.
ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అన్న చందంగా ఈ బుకింగ్స్ ఉంటాయని డీలర్లు చెబుతున్నారు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ జూన్ 11, 2013న దేశీయ విపణిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. అలాగే డెలివరీలు కూడా వచ్చే నెలాఖరు నాటికి కానీ లేదా జులై నెల ఆరంభంలో కానీ జరిగే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు రోడ్ షోల ద్వారా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మంచి మార్కెటింగ్ను సొంతం చేసుకుంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ మరియు కంపెనీ అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ పట్ల ఇప్పటికే ఆటోమొబైల్ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈకోస్పోర్ట్కు భారీ సంఖ్యలో డిమాండ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చింది.
ఈ కాంపాక్ట్ ఎస్యూవీ భారత్లో మొత్తం నాలుగు వేరియంట్లలో (ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్) లభ్యం కానుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, వేరొకటి 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications








