జనవరి 2014 నుంచి పెరగనున్న షెవర్లే కార్ల ధరలు
షెవర్లే కార్లు కూడా జనవరి నుంచి మరింత ప్రియం కానున్నాయి. కొత్త సంవత్సరంలో ధరలు పెంచుతున్న కంపెనీల జాబితాలోకి తాజాగా జనరల్ మోటార్స్ ఇండియా వచ్చి చేరింది. జనవరి 2014 నుంచి అన్ని మోడళ్ల ధరలను రూ.10,000 వరకు పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రభావాన్ని కొంతమేరకైనా తట్టుకునేందుకు ధరలను పెంచుతున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ తెలిపారు. ప్రస్తుతం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో షెవర్లే స్పార్క్ హ్యాచ్బ్యాక్ నుంచి షెవర్లే కాప్టివా వరకు వివిధ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

దేశీయ విపణిలో జనరల్ మోటార్స్ ఇండియా విక్రయిస్తున్న కార్ల ధరలు రూ.3.33 లక్షల నుంచి రూ. 25.71 లక్షల రేంజ్లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). రూపాయి పతనం, ద్రవ్యోల్బణం పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం మొదలైన కారణాల వల్ల ఇప్పటికే పలు వాహన కంపెనీలు వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నాయి.
కాగా.. ఇప్పటికే జనవరి 2014 కార్ల ధరలను పెంచనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోక్స్వ్యాగన్ ఇండియా కంపెనీలతో పాటుగా బిఎమ్డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








