జూన్ చివరి నాటికి మార్కెట్లోకి రానున్న అంబాసిడర్ బిఎస్-4
సికె బిర్లా గ్రూపుకు చెందిన పురాతన దేశీయ ఆటోమొబైల్ కంపెనీ హిందుస్థాన్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న అంబాసిడర్ సెడాన్లో ఇప్పుడు అధునాతన ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఆధునిక కాలుష్య నిబంధనలకు లోబడి, బిఎస్-4 (భారత్ స్టేజ్ 4) కాలుష్య నిబంధనలను పాటించే అంబాసిడర్ కారును జూన్ చివరి నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
గడచిన సంవత్సరంలో అంబాసిడర్ కార్లు అంతంత మాత్రంగా అమ్ముడుపోయిన సంగతి తెలిసినదే. అయితే, ఏప్రిల్ 2013 నెలలో మాత్రం ఏకంగా 90.71 శాతం అమ్మకాల వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సమయంలో కంపెనీ 534 యూనిట్లను విక్రయించగా, ఇదివరకటి సంవత్సరం ఏప్రిల్ నెల అమ్మకాలు కేవలం 280 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయని హిందుస్థాన్ మోటార్స్ తెలిపింది.

కేవలం ఏప్రిల్ నెలలోనే కాకుండా ఈ ఏడాది జనవరిలో 104.37 శాతం, ఫిబ్రవరిలో 166.5 శాతం మరియు మార్చ్ నెలలో 24.33 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా హిందుస్థాన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఉత్తమ్ బోస్ మాట్లాడుతూ.. తమ నిర్వాహక సామర్థ్యం, వినియోగదారుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మెరుగుపరచిన నాణ్యత మరియు మారుమూల మార్కెట్లలోకి ప్రవేశించడం వంటి ప్రయత్నాల ద్వారా ఈ వృద్ధిని సాధించగలిగామని అన్నారు.
ఆధునిక కాలుష్య నిబంధనలకు లోబడి బిఎస్-4 ఇంజన్తో కూడిన అంబాసిడర్ కారును జూన్ నెలాఖరు నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, హిందూస్థాన్ మోటార్స్ ఓ కాంపాక్ట్ అంబాసిడర్ సెడాన్ (ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గాను 4 మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండేలా)ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ బుజ్జి కారు ధర రూ.4 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








