జాజ్ ఉత్పత్తిని నిలిపివేసిన హోండా, అమేజ్ కోసమేనా..!
జపాన్కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ 'హోండా జాజ్' ఇకపై కనుమరుగు కానుంది. గ్రేటర్ నోయిడా ప్లాంటులో హోండా తమ జాజ్ హ్యాచ్బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ కారు కోసం ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్ బుకింగ్లు అన్నింటినీ కంపెనీ క్లియర్ చేసి, కొత్త బుకింగ్లను స్వీకరించడాన్ని కూడా ఆపివేసింది. ఆగస్ట్ 2011లో హోండా జాజ్లో ఓ సరికొత్త వెర్షన్ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. మునపటి వెర్షన్తో పోల్చుకుంటే దీని ధర సుమారు రూ.1 లక్ష వరకూ తక్కువ.
పాత వెర్షన్ జాజ్ ధర ఎక్కువగా ఉండటంతో, అప్పట్లో ఈ మోడల్ అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగేవి. అయితే, ధర తగ్గించి విడుదల చేసిన సరికొత్త హోండా జాజ్తో మళ్లీ ఈ మోడల్ అమ్మకాలు స్వల్పంగా పుంజుకున్నాయి. కాగా.. త్వరలో హోండా తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్'ను మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, హోండా జాజ్ ఉత్పత్తిని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. భారత మార్కెట్ స్థితగతులను దృష్టిలో ఉంచుకొని హోండా తమ అమేజ్ సెడాన్ను అభివృద్ధి చేసింది.
ఈ కారు భారత మార్కెట్లో విడుదలైతే, దీనికి మంచి డిమాండ్ రావచ్చనే అంచనాతో కంపెనీ ఇప్పటి నుండే అందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ నోయిడా ప్లాంటులో జాజ్ ఉత్పత్తిని నిలిపివేసి, దాని స్థానంలో అమేజ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోండా జాజ్ తొలుతగా 2009లో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ మోడల్ అధిక ధర ఉండటం కారణంగా దేశీయ విపణిలో ఇది పెద్దగా సక్సెస్ను సాధించలేకపోయింది.



Click it and Unblock the Notifications








