హ్యుందాయ్ ఖాతాలో మరో మైలురాయి: 50 లక్షవ కారు ఉత్పత్తి
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మరియు అతిపెద్ద ఎగుమతిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ భారత్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది.
తాజాగా ఉత్పత్తి చేసిన 50 లక్షవ కారును (హ్యుందాయ్ గ్రాండ్ ఐ10) చెన్నైలోని ఇరుంట్టుకొట్టయ్ ప్లాంటులో నేడు (అక్టోబర్ 17, 2013) హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఈఓ, ఎమ్డి బి.ఎస్ సియో సమక్షంలో ఆవిష్కరించారు.

హ్యుందాయ్ 1998లో భారత్లో ఉత్పత్తిని ప్రారంభించింది. భారత్లో 15 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న హ్యుందాయ్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్కు తీసుకొస్తోంది. హ్యుందాయ్ భారత్లో 2.7 బిలియన్ డాలర్ల పెట్టుబడితో, ఏటా 6.8 లక్షల కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
తమిళనాడు రాష్ట్ర జిడిపిలో 4 శాతం తోడ్పాటు చేస్తున్న హెచ్ఎమ్ఐఎల్, 1996 నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు కూడా భారీగానే తోడ్పాటును అందించింది. హ్యుందాయ్కు భారత ప్యాసింజర్ కార్ విభాగంలో 20.3 శాతం మార్కెట్ వాటా ఉండగా, ఎగుమతి విభాగంలో 46 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
హ్యుందాయ్ భారత్లో మారుతి సుజుకి తర్వాత అత్యంత విశ్వసనీయమైన, ఎంపిక చేసుకోదగిన బ్రాండ్గా ఎదిగింది. హ్యుందాయ్ తమ 50 లక్షవ కారు ఉత్పత్తితో పాటుగా, భారత్లో తమ 15 ఏళ్ల వేడుకలను కూడా జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications








