రూ.20,000 మేర పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచనున్న ఆటోమొబైల్ కంపెనీల్లో తాజా హ్యుందాయ్ వచ్చి చేరింది. జనవరి 2014 ప్రారంభం నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ధరల పెంపు మోడల్ను బట్టి రూ.5,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉంటుందని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు శాంత్రో మొదలుకొని ప్రీమియం సెడాన్ సొనాటా వరకు విభిన్న వాహనాలను విక్రయిస్తోంది. భారత మార్కెట్లో వీటి ధరలు రూ.2.89 లక్షల నుంచి రూ.26.69 లక్షల రేంజ్లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ప్రస్తుత ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో, రూపాయి విలువ క్షీణత మరియు ద్రవ్యోల్బణం వలన ఉత్పాదక వ్యయం నిరంతరాయంగా పెరుగుతోందని, ఫలితంగా ధరలు పెంచడం తప్పడం లేదని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.

అయితే, ఈ ఖర్చుల్లో చాలా వరకు కంపెనీయే భరిస్తోంది, అతికొద్ది భారాన్ని మాత్రమే వినియోగదారులపైకి బదిలీ చేశామని, తాము అందిస్తున్న మోడళ్ల ధరలను రూ.5,000 నుంచి రూ.20,000 మేర పెంచుతామని, ఈ పెంపు జనవరి 2014 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.
కాగా.. ఇప్పటికే జనవరి 2014 కార్ల ధరలను పెంచనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా,హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోక్స్వ్యాగన్ ఇండియా కంపెనీలతో పాటుగా బిఎమ్డబ్ల్యూ ఇండియా, ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీలు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








