భారత లగ్జరీ మార్కెట్పై కన్నేసిన హ్యుందాయ్..
భారత ప్యాసింజర్ కార్ విభాగంలో మంచి విజయం సాధించిన, దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు లగ్జరీ కార్ విభాగంపై కన్నేసింది. భారత్లో సంపన్న వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లోని డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ లగ్జరీ బ్రాండ్లను భారత్లో విడుదల చేయాలని యోచిస్తోంది.
హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న జెనిసిస్, ఈక్వస్ లగ్జరీ బ్రాండ్లను భారత్కు కూడా పరిచయం చేయనుంది. గడచిన 12 ఏళ్ల క్రితం భారత్లోకి ప్రవేశించిన కొరియన్ కంపెనీ హ్యుందాయ్, దేశీయ విపణిలో మంచి స్మాల్ కార్ కంపెనీగా గుర్తింపుతు తెచ్చుకుంది. అయితే, ఈ గుర్తింపే లగ్జరీ విభాగానికి ఆటంకంగా మారింది.
ప్రస్తుతం హ్యుందాయ్ భారత మార్కెట్లో వెర్నా, ఎలాంట్రా, సొనాటా వంటి ప్రీమియం మోడళ్లను అందిస్తున్నప్పటికీ, ఇవి లగ్జరీ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, హ్యుందాయ్ ఓ స్మాల్ కార్ బ్రాండ్గా గుర్తింపు ఉండటమే.

ప్రస్తుతం తాము భారత లగ్జరీ కార్ మార్కెట్ గురించి అధ్యయనం చేస్తున్నామని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈక్వస్ బ్రాండ్ మరిన్ని లగ్జరీ మోడళ్లను తాము గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్నామని, ఇలాంటి కార్లను విక్రయించేందుకు ప్రత్యేకమైన నెట్వర్క్ కావాలని, హ్యుందాయ్ లగ్జరీ కార్లను కస్టమర్లు అంగీకరిస్తారా లేదా అనేది పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్ ఇండియా అధికారి ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, హ్యుందాయ్ ఇటీవలే ఓ కొత్త పెర్ఫామెన్స్ డివిజన్ను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ పెర్ఫామెన్స్ డివిజన్కు 'హ్యుందాయ్ ఎన్' (Hyundai N) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. హ్యుందాయ్ ఎన్ పెర్ఫామెన్స్ డివిజన్ మోటార్స్పోర్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే, హైపెర్ఫామెన్స్ కార్ల అభివృద్ధికి కూడా కృషి చేయనుంది. ఈ సందర్భంగా, హ్యుందాయ్ అభివృద్ధి రేస్ వెర్షన్ ఐ20 డబ్ల్యూఆర్సి (వరల్డ్ ర్యాలీ కార్)ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది రెగ్యులర్ ఐ20 కన్నా అత్యంత శక్తివంతమైనది.


Click it and Unblock the Notifications








