ఫోర్డ్ ఈకోస్పోర్ట్కు పోటీగా హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్యూవీ
దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, రానున్న రెండేళ్లలో భారత మార్కెట్లో నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఈ మోడళ్లలో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ కూడా ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ ఈ ఏడాదిలో ఓ కాంపాక్ట్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్లను టార్గెట్ చేస్తూ ఓ సబ్-ఫోర్ మీటర్ కారును కూడా హ్యుందాయ్ ప్రవేశపెట్టనుంది.
భారత్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అత్యంత కీలకమైనదని, ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించడంలో తాము కాస్తంత ఆలస్యం వహించినప్పటికీ, ఇందులో రాణించగలమని, ఇందుకోసం ప్రస్తుతం ఓ కాంపాక్ట్ ఎస్యూవీని అభివృద్ధి చేస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బో షిన్ సెయో తెలిపారు. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ, రానున్న రెండేళ్లలో నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేయాలన్న హెచ్ఎమ్ఐఎల్ ప్రణాళికలో భాగమని కంపెనీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న ఐ10, ఐ20 హ్యాచ్బ్యాక్లకు మధ్యలో ఓ చిన్న కారును (కోడ్నేమ్ 'బిఏ') అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసినదే. కాగా.. హ్యుందాయ్ విడుదల చేస్తామన్న సబ్-ఫోర్ మీటర్ (4 మీటర్ల కన్నా పొడవు తక్కువ ఉన్న) కారును ఇదే కాంపాక్ట్ కారు ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సియో సమాధానమిస్తూ, అది (కాంపాక్ట్ సెడాన్) విభిన్నమైన కారని చెప్పారు. అంతకు మించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.



Click it and Unblock the Notifications








