భారత్లో 3 కొత్త కార్లను విడుదల చేయనున్న హ్యుందాయ్
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న కార్లకు, యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో, హ్యుందాయ్ ఓ కాంపాక్ట్ ఎస్యూవీని మరియు ఓ ఎమ్పివిని విడుదల చేయటంతో పాటుగా ఓ చిన్న కారును కూడా ప్రవేశపెట్టనుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి అత్యధికంగా అమ్మడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్పోటీగా హ్యుందాయ్ తమ ఐ10 మరియు ఐ20 హ్యాచ్బ్యాక్లకు మధ్యలో ఓ చిన్న కారును సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకురానుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిన్న కారు మెరుగైన మైలేజ్ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మాతృ సంస్థ అయిన కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ సీఈఓ, ఎమ్డి బో షినో సెయో ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ ఓ చిన్న ఎస్యూవీని, దాని తర్వాత ఓ ఎమ్పివి విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. హ్యుందాయ్ నుంచి రానున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, మహీంద్రా క్వాంటో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లతో తలపడనుంది.

అలాగే, హ్యుందాయ్ ఎమ్పివి ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, త్వరలో మార్కెట్లోకి రానున్న చెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఇకపోతే ఐ10, ఐ20 మోడళ్లకు మధ్యలో కంపెనీ ప్రవేశపెట్టనున్న చిన్న కారులో, హ్యుందాయ్ తాజాగా అభివృద్ధి చేసిన, అధిక మైలేజీనిచ్చే 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ చిన్న డీజిల్ ఇంజన్ లీటరుకు సుమారు 25 కిలోమీటర్ల వరకూ మైలేజీని ఇవ్వొచ్చని అంచనా. హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్ల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








