మేడ్ ఇన్ ఇండియా కారు తయారీపై హ్యుందాయ్ దృష్టి
తాజాగా ఐ10 గ్రాండ్ కాంపాక్ట్ డీజిల్ కారును ఆవిష్కరించిన హ్యుందాయ్, పూర్తిగా భారతదేశంలోనే ఓ కారును అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. పూర్తిగా భారత మార్కెట్లో లభ్యమయ్యే విడిభాగాలు, వనరులను ఉపయోగించి మేడ్ ఇన్ ఇండియా కారును తయారు చేయాలని హ్యుందాయ్ నిర్ణయించింది. ఇక్కడి మార్కెట్లో తయారైన కారును విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.
మేడ్ ఇన్ కారు కావటంతో, ఇది అతి తక్కువ ధరకే లభ్యమయ్యే ఆస్కారం కూడా ఉంది. భారత మార్కెట్లో అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా పూర్తిగా భారత్లోనే తయారయ్యే కారును రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ షారుక్ హాన్ చెప్పారు. చైనా తర్వాత ఆటోమొబైల్ రంగంలో రెండో పెద్ద మార్కెట్ అయిన భారత్లో కూడా తమ అగ్ర స్థానాన్ని పదిలం చేసుకోవడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ప్రధానమైనదని ఆయన అన్నారు.
అయితే ఈ లక్ష్యం చేరుకోవటానికి మరో ఐదేళ్ల సయమం పట్టొచ్చని అంచనా వేస్తున్నామని హాన్ తెలిపారు. ఈ లక్ష్యసాధన కోసం హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను అప్గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. తమ మాతృ కంపెనీకి కొరియాలో ఉన్న ఆర్ అండ్ డి సెంటర్తో పోల్చితే ఈ సెంటర్ శక్తి సామర్థ్యాలు తక్కువేనని అంగీకరించారు. తమ మాతృసంస్థ హ్యుందాయ్ మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేసిన కార్లను భారత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి ప్రస్తుతం ఈ హైదరాబాద్ ఆర్ అండ్ డి సెంటర్ సహకరిస్తోందని అన్నారు.



Click it and Unblock the Notifications








