డీజిల్ కారు కొంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి..
ఒక్కసారి కారు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత మన మనస్సులలో మెదిలే మిలియన్ డాలర్ల ప్రశ్న డీజిల్ కారు కొనాల..? లేక పెట్రోల్ కారా..? అని. సాధారణంగా మైలేజ్కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు డీజిల్ కార్లను, మెయింటినెస్స్కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు పెట్రోల్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం, పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల ధరలకు అలాగే కార్ల ధరలకు మధ్య భారీ వ్యత్యాం ఉంది. లీటర్ డీజిల్ ధర సుమారు రూ.47-51 మధ్యలో ఉండగా, లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ.68-72 మధ్యలోను ఉంది (రాష్ట్రాన్ని బట్టి ధరలు వేర్వేరుగా ఉంటాయి).
అయినప్పటికీ, కోనుగోలుదారులు డీజిల్ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ తాజా పరిణామాలు గమనిస్తుంటే, మళ్లీ పెట్రోల్ కార్ల రాజ్యమే రానుంది. గడచిన సెప్టెంబర్ నెలలో చమురు కంపెనీలు లీటరు డీజిల్పై రూ.5 మేర పెంపును విధించిన సంగతి తెలిసిందే. దీనికితోడు డీజిల్ ధరను రానున్న 10 నెలల్లో ప్రతి నెలా ఒక్కో రూపాయి చొప్పున రూ.10 వరకూ పెంచాలని ఇటు చమురు కంపెనీలు, అటు ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే, ఈ ఏడాది చివరి నాటికి లీటరు డీజిల్ ధర రూ.60 లకు పైగా పెరిగే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో కేవలం మైలేజ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డీజిల్ కారును కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో ఈ కారును ఎందుకు కొన్నాం బాబోయ్ అని తలబాదుకునే పరిస్థితి రావచ్చు. సాధారణంగా, ధరలో పెట్రోల్ కారుకు డీజిల్ కారు మధ్య సుమారు లక్ష రూపాయల వరకూ వ్యత్యాసం ఉంటుంది. అలాగే, మెయింటినెన్స్ విషయంలో కూడా పెట్రోల్ కారు మెయింటినెన్స్ కన్నా డీజిల్ కారు మెయింటినెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే, ప్రస్తుత మార్కెట్ సినారియోను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ కారును కొనుగోలు చేయటమే ఉత్తమమనేది మార్కెట్ విశ్లేషకుల భావన. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications








