చిత్తూరు జిల్లాలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం: ఇసుజు
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ మన రాష్ట్రంపై కన్నేసింది, సాలీనా 1.6 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో, రూ. 1500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో తమ యూనిట్ను నెలకొల్పనుంది. ఈ మేరకు ఇసుజు కంపెనీ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్ రెడ్డిని సచివాలయంలో కలుసుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అందుకు కంపెనీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ట్రక్కు, కార్ల ఉత్పత్తి ప్లాంటు ద్వారా సుమారు 29 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏప్రిల్ 2016 నాటికి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా.
రాష్ట్ర ప్రభుత్వం 2010-15 పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రోత్సాహకాలను అందజేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిగిసిన ప్రతినిధి బృందంలో టి. కికూచి, పి. మియాచీ, ఎస్. ఒకాబయాషీ, సందీప్, కోయెకె, తాకాహాషి, వూహిరా, ఇటో ఉన్నారు. మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా.. ఇసుజు మోటార్స్ తమ కొత్త ప్లాంటు అందుబాటులోకి వచ్చే లోపుగా, తాత్కాలికంగా హిందూస్థాన్ మోటార్స్ ప్లాంటులోని సౌకర్యాలను ఉపయోగించుకొని ఇక్కడ ఉత్పత్తి చేపట్టనుంది.



Click it and Unblock the Notifications








