రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు కోసం సర్కారుతో ఒప్పందం: ఇసుజు
జపాన్కు చెందిన ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) ఆంధ్రప్రదేశ్లో ఓ ప్లాంటునును ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇసుజుతో రాష్ట్ర ప్రభుత్వం నేడు (మార్చి 15, 2013 శుక్రవారం) ఓ అవగాహన ఒప్పందం(ఎమ్ఓయూ)ను కుదుర్చుకోనుంది.
ప్రారంభంలో భాగంగా, ఈ ప్లాంటు ఏర్పాటు కోసం కంపెనీ సుమారు రు.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్లాంటులో తొలుత సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఓ ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) ఉత్పత్తి కేంద్రాన్ని కంపెనీ స్థాపించనుంది. ఈ ప్లాంటులో 2015 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. సాలీనా 50,000 కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కంపెనీ ఈ ప్లాంటును నెలకొల్పనుంది.
శ్రీసిటీలో ఏర్పాటు కానున్న ఇసుజు ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క కార్ల తయారీ కంపెనీ కూడా రాలేదు. జహీరాదాబ్లో ఇటీవలే ట్రాక్టర్ ప్లాంటును ప్రారంభించిన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా రాష్ట్రంలో ఓ కార్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, రాష్ట్రంలోకి తొలుతగా ప్రవేశించనున్న మొట్టమొదటి ఆటోమొబైల్ కంపెనీగా ఇసుజు మోటార్స్ నిలువనుంది.

ప్లాంటు ఏర్పాటుతో సంబంధం లేకుండా, ఇసుజు మోటార్స్ ఓ రెండు ఉత్పత్తులను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇసుజు నుంచి అత్యంత పాపులర్ అయిన ఎమ్యూ-7 ఎస్యూవీ మరియు డి-మ్యాక్స్ పికప్ ట్రక్లను కంపెనీ దేశీయ విపణిలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మోడళ్లకు బుకింగ్లను తీసుకోవటం కూడా కంపెనీ ప్రారంభించింది. తమ కొత్త ప్లాంటు పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వచ్చే వరకూ చెన్నైలోని తిరువళ్లూర్లో ఉన్న హిందుస్థాన్ మోటార్స్ లేదా జనరల్ మోటార్స్ కార్ ప్లాంట్లను ఇసుజు ఉపయోగించుకోనుంది.


Click it and Unblock the Notifications








