అన్ని వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారాలు తప్పనిసరి!
ఒకప్పుడు వోల్వో బస్సులో ప్రయాణం అంటే, ఎంతో సౌకర్యమైనది మరియు సురక్షితమైనది. కానీ ఇప్పుడు వోల్వో బస్సులు ప్రయాణికుల గుండెల్లో హడల్ పుట్టిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో వరుసగా రెండు వోల్వో బస్సులు మంటల్లో కాలిపోవటంతో, కర్ణాటక సర్కారు మేలుకొంది. ఈ మేరకు తాము నడుపుతున్న అన్ని వోల్వో బస్సులలో తప్పనిసరిగా అత్యవసర ద్వారాలను ఎర్పాటు చేయాల్సిందిగా కర్ణాటక రాష్ట ప్రభుత్వం వోల్వో కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.
మూడు నెలలో సమయంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో ప్రమాదం నుంచి ప్రయాణికులు తేరుకోకముందే, కర్ణాటకలోని హవేరీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం 52 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈ ప్రమాదాలకు గల కారణాలను అంచనా వేసేందుకు స్వీడన్ నుంచి వోల్వో ప్రతినిధులు వచ్చి విచారణ చేస్తున్నారు.

వోల్వో బస్సులకు కర్ణాటక అతిపెద్ద మార్కెట్. దేశం మొత్తమ్మీద సగటున 5,000 వోల్వో బస్సులు అమ్ముడుపోతే అందులో దాదాపు 1,000 వోల్వో బస్సులు కర్ణాటకలోనే అమ్ముడుపోతుంటాయి.

ఇటీవల జరిగిన వోల్వో బస్సు ప్రమాదాల నేపథ్యంలో, కేవలం కెఎస్ఆర్టీసీ ఉపయోగించే వోల్వో బస్సులే కాకుండా, ఆ రాష్ట్రంలో ఇతర బస్ ఆపరేటర్లు ఉపయోగించే అన్ని వోల్వో బస్సుల్లో తగిన ఎత్తులో అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయటం తప్పనిసరి చేసింది. అత్యవసర ద్వారాలు లేని బస్సులపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, వాటిని సీజ్ చేయటం కూడా జరుగుతుందని సర్కారు తెలిపింది.

ఈ విషయంలో తాము వప్రభుత్వం మరియు దాని సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, వివిధ అంశాలను తనిఖీ చేసేందుకు తమ గ్లోబల్ హెడ్క్వార్ట్స్ నుంచి ఓ బృందం త్వరలోనే ఇక్కడి వస్తుందని వోల్వో ఇండియా ప్రతినిధి ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.

వోల్వో ఇండియాకు బస్సుల విభాగంలో కర్ణాటక అతిపెద్ద మార్కెట్. ప్రభుత్వ నిబంధనలు పాటించండంలో వోల్వో విఫలమైనట్లయితే, కర్ణాటక ఇకపై వోల్వో నుంచి బస్సులు కొనుగోలు చేయదు.

భారత మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్, ఇసుజు, టాటా, స్కానియా వంటి లగ్జరీ బస్సులు వచ్చినప్పటికీ వోల్వో బస్సులే ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు వోల్వో సౌకర్యంతో పాటు సేఫ్టీని కూడా అందించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








