కిజాషి ఓ దురదృష్టవంతమైన కారు: సుజుకి ఆస్ట్రేలియా బాస్
మారుతి సుజుకి అందిస్తున్న ప్రీమియం సెడాన్ కిజాషి భారత మార్కెట్లోనే కాదు, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వైఫల్యాన్ని చవిచూస్తోంది. మారుతి సుజుకి మాతృ సంస్థ జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ తొలిసారిగా 2009లో కిజాషి కారును తయారు చేసింది. ఫిబ్రవరి 2011లో ఇది భారత మార్కెట్లో విడుదలైంది. ఆరంభంలో ఈ కారుకు డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, ఇప్పడది పూర్తిగా తగ్గిపోయింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకు ఒక్క కారు కూడా అమ్ముడుపోవటం లేదు. దేశీయ విపణిలో దీని ధరలు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మారుతి సుజుకి ఈ కారుపై ఏకంగా రూ.5 లక్షల డిస్కౌంట్ను కూడా ప్రకటించింది. అయినప్పటికీ ఫలితం మాత్రమే శూన్యం. కిజాషి ప్రీమియం కారు ఇలా భారత్లోనే కాకుండా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లో కూడా కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది.

కిజాషి కారు గురించి సుజుకి ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మసాకి కారో మాట్లాడుతూ.. ఇదొక 'చాలా దురదృష్టమైన కారు' (వెరీ అన్లక్కీ కార్) అని కిజాషిని అభివర్ణించాడు. ఈ కారుకు తమకు పెద్ద తలనొప్పిగా పరణించిందని, కిజాషిని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశంపై అనేక ప్రశ్నలు, వాదనలు తలెత్తుతున్నాయని, ఇప్పటికే ఈ కారును అభివృద్ధి చేసేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు వెచ్చించామని, ఈ కారు సక్సెస్ కాదని ముందే తెలిసి ఉంటే, అసలు దీనిని 2009లో విడుదల చేసి ఉండేవారం కాదని ఆయన అన్నారు.
భారత్లో మారుతి సుజుకి కిజాషి ప్రీమియం సెడాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్, డిఓహెచ్సి ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్ల శక్తిని, 230 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో లభిస్తుంది.

ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.53 కి.మీ. మైలేజీని ఇవ్వగా, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కిజాషి గరిష్టంగా గంటకు 205 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ లీటరు పెట్రోల్కు 12.45 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, వోల్క్స్వ్యాగన్ జెట్టా, స్కొడా లారా వంటి ప్రీమియం కార్లకు పోటీగా మారుతి సుజుకి తమ కిజాషిని ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








