వాహనాల ధరలను పెంచనున్న మహీంద్రా అండ్ మహీంద్రా
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) రానున్న త్రైమాసికాల్లో ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచేందుకు కంపెనీ యోచిస్తోంది.
ఇన్పుట్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో తమ వాహనాల ధరలను స్వల్పంగా పెంచే ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్) పవర్ గోయెంకా తెలిపారు. కమోడిటీ ఖర్చుల ఒత్తిడి ఎక్కువగా లేనందున ఈ ధరల పెంపు మార్జినల్గా ఉంటుందని ఆయన తెలిపారు.
గడచిన సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా తమ అన్ని మోడళ్ల ధరలను 2.5 శాతం మేర, అలాగే గడచిన జులై నెలలో 0.5 శాతం మేర ఉత్పత్తుల ధరలను పెంచిందని గోయెంకా వెల్లడించారు.

మరోవైపు దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉందని, రానున్న పండుగ సీజన్కు ముందే ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసినదే.
వరుసగా గడచిన తొమ్మిది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, జులై 2013లో భారత కార్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్ల కంపెనీలు ధరలు పెంచడం వలన అమ్మకాలు మరింత తగ్గే ఆస్కారం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








