ఉత్పత్తుల ధరలను పెంచనున్న మహీంద్రా అండ్ మహీంద్రా
ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, ద్రవ్యోల్బణాల వలన కొన్ని మోడళ్లపై ధరలను 1-2 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్) పవన్ గోయెంకా తెలిపారు. అయితే, ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలు పెంచుతున్నామనే విషయాన్ని, ధరల పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఎస్యూవీలపై టాక్స్ గురించి విలేఖరులు ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇప్పటికే ఆర్థిక మంత్రి నుంచి వివరణ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇటీవల వెల్లడించిన బడ్జెట్లో ఎస్యూవీలపై సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతానికి పెంచడంతో మహీంద్రా ఎస్యూవీలు, ఎమ్పివిలు ప్రభావితమయ్యాయని గోయెంకా తెలిపారు.

కాగా.. మహీంద్రా ఇటీవల ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ లభిస్తున్న స్పందన గురించి ప్రశ్నించిగా, ప్రస్తుతం ఈ మోడల్కు వస్తున్న ఆర్డర్లు నిరాశాజనకంగానే ఉన్నాయని, అయితే ఈ ఉత్పత్తి పట్ల వినియోగదారుల్లో మంచి అవగాహన ఏర్పడుతోందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, జపనీస్ కార్ కంపెనీ హోండా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కార్లలో ఆన్ బోర్డ్ డయోగ్నస్టిక్స్ ఏర్పాటు చేయటాన్ని తప్పనిసరి చేయటంతో ధరలను పెంచాల్సి వస్తుందని సదరు కంపెనీలు పేర్కొన్నాయి. (సెక్యూరిటీ ఫీచర్ల గురించి డ్రైవర్ను అలెర్ట్ చేసే ఎలక్ట్రానిక్ సాంకేతిక వ్యవస్థను ఆన్ బోర్డ్ డయోగ్నస్టిక్స్ అంటారు).


Click it and Unblock the Notifications








