మార్చి 18న వస్తున్న మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు
మహీంద్రా రేవా అభివృద్ధి చేసిన తొలి ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) విడుదల తేది ఖరారైంది. తెలుగు డ్రైవ్స్పార్క్ ఇది వరకటి కథనంలో ప్రచురించినట్లుగానే, తమ ఈ2ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈనెల 18న మార్కెట్లో విడుదల చేస్తామని మహీంద్రా రేవా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారును మహీంద్రా తొలిసారిగా గడచిన సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించింది.
మార్చి 18, 2013న న్యూఢిల్లీలో ఈ కారును వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్, ఫామ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్) డా. పవన్ గోయెంకా తెలిపారు. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్లాటినం సర్టిఫికెట్ పొందిన బెంగుళూరు ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటులో ఏటా సుమారు 30,000 ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి కానున్నాయి.
ప్రకృతి ఏవిధంగాను హాని కలిగించని రీతిలో (ఈకో ఫ్రెండ్లీ) కారును మహీంద్రా రేవా తయారు చేసింది. మహీంద్రా ఈ2ఓ పేరులో ఈ అనే అక్షరం సూర్యుని శక్తిని, 2 (టూ) కారులో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని, ఓ అనే అక్షరం ఆక్సిజన్ను ప్రతిభింభింపజేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన నెక్స్ట్ జనరేషన్ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు.



Click it and Unblock the Notifications








