హైబ్రిడ్ వెర్షన్ స్కార్పియోను ప్రవేశపెట్టేందుకు మహీంద్రా ప్లాన్స్
ప్రపంచంలో కెల్లా అతి చవకైన ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన 'ఈ2ఓ'ను భారత్లో విడుదల చేసిన ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల తయారీపై దృష్టి సారించి. అటు సాంప్రదాయం ఇంధనం (పెట్రోల్, డీజిల్ మొదలైనవి)తో పాటు ఇటు బ్యాటరీ పవర్తో నడిచే ఎస్యూవీలను తయారు చేయాలని మహీంద్రా యోచిస్తోంది.
వాస్తవానికి మహీంద్రా గడచిన సంవత్సరంలోనే ఓ హైబ్రిడ్ వెర్షన్ మహీంద్రా స్కార్పియోను ప్రదర్శనకు ఉంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించేందుకు ప్రస్తుతం వీటిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మహీంద్రా అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త హైబ్రిడ్ సిస్టమ్ను మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్బాక్స్)తో కూడా అనుసంధానం చేసుకోవచ్చు.
ఈ తరహా టెక్నాలజీ ప్రపంచంలో కెల్లా ఇదే మొట్టమొదటిది కానుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఇతర తయారీదారులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ సిస్టమ్లను పూర్తిగా ఆటోమేటిక్ లేదా సెమీ-ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో మాత్రమే అనుసంధానం చేసుకునే వీలుంటుంది. కానీ, పూర్తిస్థాయిలో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో హైబ్రిడ్ సిస్టమ్ను అనుసంధానం చేసే ప్రక్రియను మన మహీంద్రా తయారు చేస్తోంది.

చెన్నైలోని ఓరగడం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం (ఆర్ అండ్ డి సెంటర్)లో ఓ యూరోపియన్ కన్సల్టెంట్తో కూడిన 14 మంది ఇంజనీర్ల బృందం ఈ హైబ్రిడ్ వాహనాల టెక్నాలజీపై నిరంతరం పనిచేస్తూనే ఉందని, ఇందుకోసం తాము రూ.300 కోట్ల పెట్టుబడులను వెచ్చించామని మహీంద్రా అండ్ మహీంద్రా గతంలో ఒకానొక సందర్భంలో వెల్లడించింది.
హైబ్రిడ్ వాహనాల వినియోగం వలన మైలేజ్ పెరగటమే కాకుండా, పర్యావరణానికి కూడా పెద్దగా హాని కలగకుండా ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే. మహీంద్రా అందిస్తున్న స్కార్పియో, ఎక్స్యూవీ500 మోడళ్లలో తొలుతగా హైబ్రిడ్ వెర్షన్లు విడుదల కావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








