సబ్సిడీ ఇచ్చే వరకు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయం: మహీంద్రా
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఓ షాకింగ్ న్యూస్ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తున్న మహీంద్రా భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తుందని భావిస్తుంటే, ఈ వాహనాలపై ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సాయం అందిస్తే తప్ప, కొత్తగా ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయబోమని తేల్చి చెప్పేసింది.
ఈ ఏడాది మార్చ్ నెలలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ 'మహీంద్రా ఈ2ఓ'ను విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందులో భాగంగానే జియో, మాక్సిమో పికప్ ట్రక్కులు మరియు వెరిటో సెడాన్లలో ఎలక్ట్రిక్ వెర్షన్లను అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తామని కంపెనీ పేర్కొంది.

అయితే, కంపెనీ ఇప్పుడు తమ ప్లాన్స్ మార్చుకుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం సబ్సిడిని ఆఫర్ చేసే వరకూ వీటిని ఉత్పత్తి చేయకూడని మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయించుకుంది. ఇందుకు ఓ ప్రధాన కారణం ఉంది. మహీంద్రా భారీ ఆశలతో తమ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, ఇది మార్కెట్లో ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదు.
మహీంద్రా ఈ2ఓ కారుపై ప్రభుత్వం సబ్సిడీ ఆఫర్ చేయని కారణంగా దీని ధర రూ.8 లక్షలు దాటిపోయింది. ఫలితంగా ఈ కారును కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మహీంద్రా ఈ2ఓ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 400 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో మహీంద్రా యాజమాన్యం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ విషయం గురించి మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్) డా. పవన్ గోయెంకా మాట్లాడుతూ.. 'ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ రాకపోయినట్లయితే, బహుశా మేము భారత్లో విక్రయించే ఏకైక మోడల్ ఈ2ఓ మాత్రమే అవుతుంద'ని అన్నారు. ఈ2ఓ దేశీయ మార్కెట్లో అంతంత మాత్రంగా అమ్ముడుపోతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం బాగానే సేల్ అవుతుంది.


Click it and Unblock the Notifications








