నాలుగు కొత్త ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్న మహీంద్రా
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇప్పుడు నాలుగు కొత్త వాహన ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్తులో తాము తయారు చేయబోయే వాహనల కోసం ఈ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. పవన్ గోయెంకా మాట్లాడుతూ.. తమ డిజైనర్లు, ఇంజనీర్లు నాలుగు కొత్త ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్నారని, వీటిని 'యుటిలిటీ వెహికల్స్', 'స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్', 'స్మాల్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్' తయారీ కోసం ఉపయోగించుకోనున్నానని ఆయన వివరించారు.

ఈ కొత్త ప్లాట్ఫామ్లపై రూపు దిద్దుకోనున్న సరికొత్త మోడళ్లన్నీ 2015-16 నాటికి అందుబాటులోకి రానున్నాయి. మహీంద్రా తమ పాపులర్ ఎక్స్యూవీ500 ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని, ఓ కాంపాక్ట్ ఎస్యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ ఎస్యూవీ ఎస్101 అనే కోడ్ నేమ్తో తయారు చేస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.
మరో వైపు ప్రస్తుతం కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మహీంద్రా స్కార్పియోలో కూడా ఓ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను తీసుకువచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే, టాటా మోటార్స్ అందిస్తున్న ఎల్సివిలకు పోటీగా ఓ కొత్త ఎల్సివిని కూడా మహీంద్రా విడుదల చేయనుంది. మహీంద్రా కొత్త ప్లాట్ఫామ్లను ఆధారంగా చేసుకొని, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న బొలెరో, స్కార్పియో, జైలో మోడళ్లలో నెక్స్ట్ జనరేషన్ వెర్షన్లు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అయితే, ఇందుకు కొంత సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








