గ్రామీణ మార్కెట్లపై కన్నేసిన మారుతి సుజుకి ఇండియా
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, దేశీయ విపణిలో తన అగ్రస్థానాన్ని ఇలాగే పదికాలాల పాటు పదిలంగా ఉంచుకునేందుకు సరికొత్త సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, మారుతి సుజుకి ఇండియా ఇప్పుడు గ్రామీణ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దాదాపు లక్షకు పైగా గ్రామాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించామని కమపెనీ చైర్మన్ ఆర్.సి భార్గవ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలానికి అన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు దాదాపు 4-5 శాతం క్షీణించాయని, అయితే మొత్తం అమ్మకాల్లో 30 శాతంగా ఉండే గ్రామీణ ప్రాంత విక్రయాలు మాత్రం 18 శాతం వృద్ధి చెందాయని ఆయన వివరించారు. కానీ ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ 5-6 శాతం తగ్గిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్న గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో, అమ్మకాలు పెంచుకునేందుకు ఈ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నామని భార్గవ చెప్పారు.

గ్రామీణ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలను ఐదేళ్ల క్రితమే రూపొందించుకున్నామని, ఈ ప్రణాళికలో భాగంగా గడచిన ఏడాది కాలంలో 44,000 గ్రామాలకు చేరువయ్యామని, ఇది ఈ ఏడాది నవంబర్ నాటికి 60,000 గ్రామాలకు పెరిగిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 6.51 లక్షల గ్రామాలుండగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఒక లక్షకు పైగా గ్రామాలకు మారుతిని చేర్చాలని లక్ష్యంతో ఉన్నామని ఆర్.సి భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 700 గ్రామీణ అవుట్లెట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








