రూ.20,000 మేర పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు
బుధవారం (జనవరి 16, 2013) నుంచి మారుతి సుజుకి కార్ల ధరలు పెరిగనున్నాయి. గడచిన డిసెంబర్ నెలలో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పేర్కొన్నట్లుగానే, తమ ఉత్పత్తుల ధరలను రూ.20,000 మేర పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా తమ మార్జిన్లపై ఒత్తిడి అధికమవుతున్న నేపథ్యంలో ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ వివరించింది. అయితే, ఏయే ఉత్పత్తులపై ఎంత మేర ధరలను పెంచనున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ తెలుపలేదు.
మోడల్ను బట్టి ఈ పెంపు పరిమాణం వేర్వేరుగా ఉంటుంది మరియు ధరల్లో ఈ తాజా పెంపుదల జనవరి 16, 2013 నుంచి అమల్లోకి రానుంది. ఉత్పత్తుల ధరల పెంపు రేపటి నుండి అమల్లోకి వస్తుందని, ఈ పెంపు మోడల్ను బట్టి గరిష్టంగా రూ.20,000 వరకూ ఉంటుందని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు. మారుతి సుజుకి దేశీయ విపణిలో తమ ఎంట్రీ లెవల్ కారు ఎమ్800 మొదలుకొని లగ్జరీ సెడాన్ కిజాషి వరకూ వివిధ మోడళ్లను ఆఫర్ చేస్తోంది. ఇక్కడి మార్కెట్లో వీటి ధరలు రూ.2.09 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.17.52 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయి.



Click it and Unblock the Notifications








